సోషల్ మీడియాతో కోట్లు.. హాట్ టాపిక్ గా క్రిస్ సాంచే సంపాదన
న్యూఢిల్లీ : ప్రస్తుత సామాజిక మార్పులకు సోషల్ మీడియా ఓ కేరాఫ్. తెల్లవార్లు ఛాటింగ్ లతో గడిచిపోయే జీవితాలకు ఇప్పుడు లెక్కే లేదు. వ్యక్తిగత ఇమేజ్ ను సైతం లైకుల్లో కామెంట్లతో కొలిచేస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఛాటింగ్ లు, గ్రీటింగులకే కాదు ఉపాధి విషయంలోను సోషల్ మీడియా ఓ ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది.
ముఖ్యంగా.. సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత వాల్ పోస్టర్ ప్రచారం కన్నా, ఫేస్ బుక్ వాల్ పై ప్రచారానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి కార్పోరేట్ కంపెనీలు. అలా ఒక్క ఫేస్ బుక్ మాత్రమే కాదు, ట్విట్టర్ వాట్సాప్ ఇలా అందుబాటులో ప్రతీ మాధ్యమాన్ని తమ ప్రచార మాధ్యమాలుగా ఉపయోగించుకుంటున్నాయి పలు కంపెనీలు.
కార్పోరేట్లు ఫాలో అవుతున్న ఈ తరహా ప్రచారం.. ఇప్పుడు 29 ఏళ్ల క్రిస్ సాంచే లాంటి వ్యక్తులకు కోట్లు కురిపించేదిగా మారింది. అందుకే ఉద్యోగాన్ని సైతం పక్కనబెట్టి క్రిస్ సాంచే ఇప్పుడు అంతకు మిన్నగా సంపాదించేస్తున్నాడు. ముందునుంచి సోషల్ మీడియాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే క్రిస్ సాంచే, ఉద్యోగం మానేశాక పూర్తిగా దానిపైనే ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు.
ఆ క్రమంలో 'ఉబర్ ఫ్యాక్ట్స్' పేరుతో ఓ ఖాతా తెరిచిన సాంచే, అందులో అత్యంత ఆసక్తికర విషయాలను పోస్ట్ చేయడం ద్వారా తన ఫాలోవర్లను పెంచుకున్నాడు. ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లతో కలిపి క్రిస్ ఫాలోవర్ల సంఖ్య కోటీ ఎనభై లక్షలు.
ఇదే కంపెనీలను క్రిస్ వైపు ఆకర్షించేలా చేసింది. క్రిస్ కు ఉన్న ఫాలోయింగ్ ను తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఉపయోగించుకోవడం మొదలుపెట్టాయి చాలా కంపెనీలు. ఇందుకు గాను క్రిస్ కు భారీ మొత్తంలోనే డబ్బు చెల్లిస్తుండడంతో ఏడాదికి రూ.3 కోట్లకు పైనే సంపాదిస్తున్నాడు క్రిస్. మొత్తానికి ఉద్యోగాన్ని సైతం పక్కనబెట్టి క్రిస్ చేసిన సాహసం అతన్ని కోటీశ్వరుడిగా మార్చేసింది.