EXCLUSIVE : కరోనా ప్రపంచానికి ఎంత డేంజర్.. వైరస్ జన్యు విశ్లేషణలో ఏం తేలింది..
ఒక్క వైరస్ ప్రపంచం మొత్తాన్ని విలవిలలాడిస్తోంది. దాదాపుగా ప్రపంచాన్ని స్తంభింపజేసే స్థితిలోకి నెట్టివేస్తోంది. రానున్న ఉత్పాతాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కరోనా వైరస్కు వ్యాక్సిన్ అంటూ ఏదీ లేకపోవడంతో నివారణ చర్యల పైనే అన్ని దేశాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రజలకు పరిశుభ్రత గురించి పదేపదే సూచనలు చేస్తున్నాయి. అదే సమయంలో ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన కొన్ని సొంత చిట్కాలు సోషల్ మీడియాలొ హల్చల్ చేస్తున్నాయి. అల్లం తింటే రాదని ఒకరు,వెల్లుల్లి అన్నింటిని తరిమేస్తుందని ఇంకొకరు.. ఇక గోమూత్రమే సర్వ రోగ నివారిణి అని ఇంకొందరు.. ఇలా ఎవరికి తెలిసినదాన్ని వాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నివారణ చర్యలపై కూడా కొన్ని అపోహలు ప్రజల్లో నెలకొన్నాయి. ఉదాహరణకు.. ముఖానికి మాస్క్ తగిలించుకుంటే ఇక వైరస్ దరిచేరదని చాలా నమ్ముతున్నారు. కానీ అందులో నిజమెంత.. అసలు వైరస్ జన్యు విశ్లేషణపై సైంటిస్టులు ఏమంటున్నారు..

ఫేస్ మాస్క్ ఎంతవరకు సేఫ్
ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా కచ్చితంగా కరోనా వైరస్ సోకదన్న గ్యారెంటీ ఏమీ లేదు. వైరస్లు కళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. ఏరోసోల్స్ అని పిలువబడే చిన్న వైరస్ కణాలు ముసుగులను సైతం చొచ్చుకుపోతాయి. అయితే కరోనా వైరస్కు ప్రధాన కారణమైన నోటి తుంపరలను సంగ్రహించడంలో మాత్రం మాస్కులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే వైరస్ సోకినవారితో సన్నిహితంగా మెలిగితే మాస్కులు కూడా ఏమీ చేయలేవు. ఒకవేళ మీకు కరోనా వైరస్ సోకితే.. మీ నుంచి ఇతరులకు సోకకుండా ఉండేందుకు మాస్కులు ఉపయోగపడుతాయి. కాబట్టి హెల్త్ కేర్ సిబ్బంది,సోషల్ కేర్ వర్కర్స్కు మాస్కులు తప్పనిసరి. అలాగే కుటుంబంలో ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డా.. వారంతా మాస్కులు ధరించడం తప్పనిసరి.

కరోనా జన్యుక్రమంపై సైంటిస్టులు ఏమంటున్నారు..
సాధారణంగా అన్ని వైరస్లు కాలక్రమేణా తమ జన్య క్రమాన్ని మార్చుకుంటాయి. ఇందుకు కోవిడ్-19 కూడా మినహాయింపు కాదు. చైనాలోని వుహాన్ మరియు ఇతర నగరాల్లోని రోగుల నుండి సేకరించిన 103 వైరస్ నమూనాలపై చైనా శాస్త్రవేత్తల జన్యు విశ్లేషణ జరిపారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం వైరస్ జన్యు పరిణామ క్రమంలో రెండు ప్రధాన ఉప రకాలు పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి L అనే జన్యు వైవిధ్యం కాగా.. మరొకటి S అనే జన్యు వైవిధ్యం. S కంటే L జాతి పరిమాణంలో ఎక్కువగా కనిపిస్తున్నట్టు గుర్తించారు. S జన్యు జాతి వైరస్ పూర్వ జన్యుశాఖగా గుర్తించారు.

వైరస్ జన్యువులో L అనే జన్యుశాఖ..
కరోనా వైరస్ పరిశోధన చేస్తున్న చైనీస్ బృందం దాని జన్యు క్రమంలోని 'L' మనిషి శరీరంలో అత్యంత ప్రభావం చూపుతుందని గుర్తించారు. మానవ శరీరంలోకి సులువుగా వెళ్లగలిగితే ఈ వైరస్.. వేగంగా దాని ప్రభావాన్ని చూపుతుందని కనుగొన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సిద్దాంతం ఊహాజనితమైనదే అని చెబుతున్నారు. కరోనా వైరస్ సోకినవారందరిలో వైరస్ జన్యుక్రమం ఒకే తీరులో ఉందనడానికి ఆధారాల్లేవు. కాబట్టి ఒక వ్యక్తి ఒక రకం నమూనా వైరస్తో బాధపడుతుంటే.. అతను దాన్ని అధిగమిస్తున్నాడా.. లేక మరింత తీవ్రమైన లక్షణాలకు గురవుతున్నాడా అనే పోల్చి చూడటానికి ఇప్పటికైతే అవకాశం లేదు.
Recommended Video

సీజనల్ ఫ్లూ కంటే 10 రెట్లు డేంజర్..
కరోనా వైరస్ సోకినవారు నిజానికి ఒక సీజనల్ ఫ్లూ(జ్వరం) సోకితే ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో.. వాళ్లు కూడా అవే సాధారణ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ లక్షణాలు సాధారణంగా అనిపించినప్పటికీ.. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సంభవిస్తున్న మరణాలను పరిశీలించినప్పుడు వాటిని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు,చైనా ఇంటర్నేషనల్ మిషన్కు సారథ్యం వహిస్తున్న బ్రూస్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా 1శాతం మరణాల రేటు సంభవిస్తున్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. సాధారణంగా వచ్చే సీజనల్ జ్వరాలతో సంభవించే మరణాల కన్నా కరోనా వైరస్ కారణంగా 10రెట్లు ఎక్కువ నష్టం జరగబోతున్నట్టు అంచనా వేశామన్నారు. సాధారణంగా సీజనల్ ఫ్లూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 29000 నుంచి 65000 మరణాలు సంభవిస్తున్నాయి. దాని కంటే కరోనా వైరస్ పది రెట్లు డేంజర్ అని చెబుతున్నారంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications