coronavirus: చైనానా మజాకా, వుహాన్లో సిచుయేషన్ కంట్రోల్, వరసగా నాలుగోరోజు నో పాజిటివ్...
కరోనా వైరస్ విశ్వ మానవాళిని గడగడలాడిస్తోంది. వైరస్ బారిన పడ్డ జనం పిట్టల్లా రాలిపోతుండగా.. వైరస్ ఆవిర్భవించిన చైనాలోని వుహాన్లో పాజిటివ్ కేసు నమోదుకాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి వుహాన్లో ఒక్క కేసు నమోదు కాలేదని చైనా అధికారులు తెలిపారు. శుక్రవారం 46 పాజిటివ్ కేసులను గుర్తించామని.. అయితే అందులో ఒక్కరే తమ దేశానికి చెందినవారు అని.. మిగతా వారు విదేశాలకు చెందినవారని వెల్లడించారు. వైరస్కు చికిత్స తీసుకుంటున్న ఆరుగురు చనిపోయారన్నారు.
వుహాన్లో క్రమంగా పరిస్థితి మెరుగుపడింది. డిసెంబర్లో కరోనా వైరస్ రక్కసి బయటపడిన సంగతి తెలిసిందే. అయితే గత నాలుగు నెలలుగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. సరిహద్దులు మూసివేసి.. బయటనుంచి ఎవరినీ రానీయలేదు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేసన్లో ఉంచి కోలుకునేందుకు కృషి చేసింది. వుహాన్లో పరిస్థితి మెరుగపడటంతో సరిహద్దులో ఏర్పాటుచేసిన చెక్ పోస్టులను అధికారులు తీసివేస్తున్నారు. వైరస్ తీవ్రత తగ్గడంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సూపర్ మార్కెట్లు, గ్రాసరీ స్టోర్స్ తెరిచి ఉంచుతున్నారు.
Recommended Video
చైనాలో కరోనా వైరస్ సోకి 3 వేల పైచిలుకు మంది చనిపోయారు. 81 వేల పైచిలుకు మంది పాజిటివ్ సోకి.. చికిత్స తీసుకుంటున్నారు. కరోనా వైరస్పై చైనా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంతో 71 వేల 740 మంది కోలుకోవడంతో.. వారిని డిశ్చార్జ్ కూడా చేశారు. మరోవైపు ఇతరదేశాల్లో మాత్రం కరోనా రక్కసి జడలువిప్పి నాట్యం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 12 వేల పైచిలుకు చేరింది. 2 లక్షల మందికి పైగా వైరస్ సోకి.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైరస్ సోకినా.. తగిన నియంత్రణ చర్యలు తీసుకోని ఇటలీలో కరోనా మరణ మృదంగం మోగుతోంది. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోలేదని.. ఇటలీ ప్రభుత్వం అంగీకరించింది.