భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్: ఏడువేల మార్క్ దాటిన మృతుల సంఖ్య
బీజింగ్: ఎక్కడో చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్.. భూగోళాన్ని చుట్టుముట్టింది. దాదాపు 170 దేశాల్లో ఈ మహమ్మారి జాడలు కనిపించాంచాయి. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య.. 7157కు చేరుకుంది. మరో 1,82,438 మందిలో ఈ వైరస్ తిష్ట వేసుకుని కూర్చుంది. ఒక్క చైనాలోనే ఇప్పటిదాకా 3,213 మంది మరణించారు. అందులో కూడా వైరస్కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ నగరం, హ్యుబే ప్రావిన్స్లోనే మృతుల సంఖ్య అధికంగా ఉంటోంది.
Coronavirus alert: కరోనా అనుమానితుల చేతికి స్టాంపు, ఎందుకంటే..?
కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యలో చైనా తరువాత ఇటలీ రెండో స్థానానికి చేరుకుంది. ఇటలీలో 2,158 మంది మరణించారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన ప్రతి దేశంలోనూ మరణాల సంఖ్య కూడా నమోదవుతోందంటే.. ఈ వైరస్ మహమ్మారి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మనదేశం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. భారత్లో కూడా ముగ్గురు ఈ వైరస్ బారిన పడి కన్నుమూశారు.
రెండు తెలుగు రాష్ట్రాలు సహా మన దేశంలో ఇప్పటిదాకా 126 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనాను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అయినప్పటికీ.. ఆశించిన స్థాయిలో దాన్ని కట్టడి చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ఈ సంఖ్య ఒకటి మాత్రమే. ఇటలీ నుంచి వచ్చిన ఓ విద్యార్థికి వైరస్ లక్షణాలు కనిపించాయి. అతణ్ని ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.
మన దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ రాష్ట్రంలో 36 పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయినట్లు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం వెల్లడించింది. ముంబైలో 64 సంవత్సరాల వృద్ధుడొకరు చికిత్స పొందుతూ మరణించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది. ముంబై నగర రవాణా వ్యవస్థకు గుండెకాయగా చెప్పుకొనే సబర్బన్ రైళ్ల రాకపోకలను నిషేధించేలా చర్యలు తీసుకోనుంది.
Recommended Video
గుజరాత్లో రైల్వే అధికారులు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. స్టేషన్ ప్లాట్ఫాం టికెట్ల రేట్లను భారీగా పెంచారు. 10 రూపాయలు ఉన్న ప్లాట్ఫాం టికెట్ రేటును 50 రూపాయలకు పెంచారు. దీనివల్ల ప్రయాణికులు మాత్రమే స్టేషన్ లోనికి వస్తారని, వారి కుటుంబ సభ్యులు గానీ, స్నేహితులు గానీ.. ప్లాట్ఫాంపైకి రాబోరని చెబుతోంది. ప్రయాణికులను రైలు ఎక్కించడానికి వారితో పాటు స్టేషన్కు వచ్చే వారి సంఖ్యను నియంత్రించడంలో భాగంగా ప్లాట్ఫాం టికెట్ల రేట్లను పెంచినట్లు వెల్లడించింది. ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే దీన్ని తొలిదశలో ప్రవేశపెట్టింది.