Coronavirus : చైనాలో 259కి పెరిగిన మృతుల సంఖ్య.. మరో 1795 మంది పరిస్థితి విషమం
చైనాలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.శనివారం నాటికి చైనాలో కరోనా మృతుల సంఖ్య 259కి పెరిగింది. గడిచిన 24గంటల్లో 46మంది కరోనా కారణంగా మృత్యువాత పడినట్టు అధికారులు వెల్లడించారు. ప్రపంచ దేశాలన్నీ చైనాలోని తమవారిని వెనక్కి రప్పిస్తున్నాయి. చైనాతో పాటు కరోనా ఇప్పటికే దాదాపు 20కి పైగా దేశాలకు విస్తరించింది. భారత్లోనూ కేరళలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది.

మరిన్ని అనుమానిత కేసులు..
కరోనా వైరస్తో ఇప్పటివరకు 259 మంది మృతి చెందగా.. మరో 12వేల మందికి వైరస్ సోకినట్టు చైనీస్ నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. వీరిలో 1795 మంది పేషెంట్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పింది. శుక్రవారం నాటికి కరోనా వైరస్ అనుమానిత కేసుల సంఖ్య 17,988కి పెరిగినట్టు తెలిపింది. మరోవైపు చైనా వెలుపల ఇతర దేశాల్లో ఇప్పటివరకు 124 కేసులు నమోదయ్యాయి.

చైనా నుంచి భారత్కు 324 మంది..
భారత్,అమెరికా,జపాన్,దక్షిణ కొరియా,బంగ్లాదేశ్ ఇరతత్రా దేశాలన్నీ ఇప్పటికే చైనాలో తమవారిని వెనక్కి రప్పించేశాయి. అక్కడే చిక్కుకుపోయిన మరికొంతమందిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాలోని దాదాపు 324 మంది భారతీయులను జంబో B747 ఎయిర్క్రాఫ్ట్లో శనివారం ఉదయం ఢిల్లీకి చేర్చారు. వీరిలో 110 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాగా.. మరో 211 మంది విద్యార్థులు. వీరందరిని ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా మానేసర్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులకు తరలించారు.

ట్రావెల్ ఆంక్షలు..
చైనాలో కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు ట్రావెల్ ఆంక్షలు కూడా అమలులోకి తీసుకొచ్చాయి. ఇటీవల చైనాను సందర్శించిన విదేశీయులెవరిని తమ దేశాల్లోకి రానివ్వకుండా ఆంక్షలు విధించాయి. ఇదివరకు రష్యా,జపాన్,పాకిస్తాన్,ఇటలీ ఈ ఆంక్షలు విధించగా.. తాజాగా అమెరికా,ఆస్ట్రేలియా కూడా ట్రావెల్ ఆంక్షలు విధించాయి.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిక..
ట్రావెల్ ఆంక్షల కారణంగా మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) హెచ్చరించింది. అధికారిక సరిహద్దుల వద్ద స్క్రీనింగ్ను ప్రవేశపెట్టాలని WHO సిఫార్సు చేసింది. అంతేకాదు,సరిహద్దులను మూసివేయడం ద్వారా వైరస్ వ్యాప్తి మరింత వేగవంతం అవుతుందని హెచ్చరించింది, ప్రయాణికులు అనధికారికంగా దేశాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికల తర్వాత కూడా ట్రావెల్ ఆంక్షలను విధించడం చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది సరైనా పద్దతి కాదని చెబుతోంది.












Click it and Unblock the Notifications