కరోనా వ్యాక్సిన్లో పంది మాంసం -ముస్లిం, యూదు పెద్దల వ్యతిరేకత -మత గ్రంథాల్లో ఏముంది?
కరోనా వైరస్ విలయం మొదలై 14 నెలలు కావస్తుండగా, గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8కోట్లకు, మరణాల సంఖ్య 18లక్షలకు చేరువయ్యాయి. కొద్ది రోజులుగా కరోనాలోనే కొత్త రకం వైరస్ విజృంభిస్తుండటంతో డజనుకుపైగా దేశాలు తిరిగి లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. వైరస్ వ్యాప్తి నిరోధానికి వ్యాక్సిన్ ఒక్కటే బ్రహ్మాస్త్రం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోన్నా.. టీకాల వాడకంతో భారీ ఉపశమనం లభిస్తుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అగ్రదేశాల్లో మాస్ వ్యాక్సినేషన్(సామూహిక టీకాల పంపిణీ) ప్రారంభమైపోగా, అనూహ్యరీతిలో..
ఆవును మందలించాడని వ్యక్తి హత్య -నిందితుడు యాదవ్ పాల వ్యాపారి -మృతుడు గుప్తా దారుణస్థితి
వ్యాక్సిన్లో పంది మాంసం
ప్రపంచవ్యాప్తంగా ఒక్కో వ్యాక్సిన్ వాడకానికి సిద్ధమవుతోంటే ఇక పీడ వదిలినట్లేనని చాలా మంది సంతోషిస్తుండగా, ఇస్లాం, యూదు మతాకుల చెందిన కొందరు మత పెద్దలు మాత్రం ఈ వ్యాక్సిన్లను వద్దంటున్నారు. కొవిడ్ వ్యాక్సిన్లలో పంది మాంసంతో చేసిన ఉత్పత్తులు వాడటంతో సదరు టీకాలను హలాల్(పవిత్ర పదార్థం)గా కాకుండా హరామ్(అపవిత్ర పదార్థం)గానే చూడాలని పిలుపునిస్తున్నారు. కొన్ని ఇస్లామిక్ దేశాలు కొవిడ్ టీకా వాడకంపై తర్జనభర్జనలు పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
అపవిత్ర జంతువు..
సాధారణంగా వ్యాక్సిన్ల జీవితకాలం పెంచడానికి, స్టోరేజ్, ట్రాన్స్ఫోర్ట్లో అవి సురక్షితంగా, సమర్థవంతంగా ఉండటానికి పంది మాంసంతో చేసిన జెలటిన్ను వాడుతుంటారు. ఇప్పుడు వీటిపైనే పలు ముస్లిం దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎడారి, దానిని ఆనుకుని ఉండే ప్రాంతాల్లో పుట్టిన ఇస్లాం, యూదు మతాలు పందిని అపవిత్ర జంతువుగా చూడటం తెలిసిందే. అలాంటి జంతువు మాసం నుంచి సేకరించిన జెలటిన్ ను వ్యాక్సిన్ తయారీలో వాడటాన్ని మత పెద్దతు కొందరు ఆక్షేపిస్తున్నారు. అయితే..
టీకా జీవితకాలాన్ని పెంచేందుకే..
వ్యాక్సిన్లో జెలటిన్ వాడకం అత్యంత సాధారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్లలో దీనిని ఒక స్టెబిలైజర్గా వాడుతారని, దీనివల్ల వ్యాక్సిన్ల జీవితకాలం పెరుగుతుందని బ్రిటిష్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సల్మాన్ వకార్ చెబుతున్నారు. కొన్ని కంపెనీలు పంది మాంసం ఉత్పత్తులు లేని వ్యాక్సిన్లను తయారు చేయడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు డిమాండ్, సప్లై చెయిన్స్, ఖరీదు, జీవితకాలం తక్కువ కావడం వంటి సమస్యలు జిలాటిన్ వాడకాన్ని తప్పనిసరి చేస్తున్నాయని వకార్ అన్నారు. ఇప్పుడే కాదు.. చాలా వరకు వ్యాక్సిన్లలో ఇంకా చాలా ఏళ్ల పాటు దీనిని ఉపయోగిస్తారని ఆయన చెప్పారు.
మత గ్రంథాలు ఏం చెబుతున్నాయి?
ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్.. పందిని అపవిత్ర జంతువుగా పేర్కొన్నప్పటికీ.. ఒక మనిషి ప్రాణాలను కాపాడటానికి హరామ్(అపవిత్ర) పదార్థాలను వాడటం తప్పేమీ కాదని కూడా రాసున్నట్లు ఇంకొందరు పెద్దలు చెబుతున్నారు. పంది మాంసం ఉంది కాబట్టి కరోనా వ్యాక్సిన్లను ముస్లింలు తీసుకోరాదంటూ చేస్తోన్న ప్రచారాన్ని నమ్మొద్దని, ముస్లింలంతా విధిగా వ్యాక్సిన్లు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్కు చెందిన ముస్లిం మత పెద్ద మౌలానా ఖాలిద్ రషీద్ ఫిరంగీ మహాలి పిలుపునిచ్చారు. యూదు మత పెద్దలు కూడా ఇదే తరహా వాదన వినిపిస్తున్నారు.
తబ్లిగీ తరహాలో పుకార్లు..
కరోనా విలయం తొలినాళ్లలో తబ్లిగీ జమాత్ సభ్యుల వల్లే ఇండియాలో వైరస్ వ్యాప్తి చెందిందనే విద్వేష పుకార్ల తరహాలోనే ప్రస్తుతం వ్యాక్సిన్ విషయంలో ముస్లింలను టార్గెట్ గా చేసుకుని పుకార్లు రేపుతున్నారనే వాదన వినిపిస్తోంది. అసలు వ్యాక్సిన్లకు మతంతో సంబంధం లేదని, మతం కంటే ప్రాణాలే ముఖ్యమని ముస్లిం పెద్దలు గుర్తుచేస్తున్నారు. పోలియో వ్యాక్సిన్ సందర్భంగా కూడా ఇస్లామిక్ సెంటర్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిందని, ఇప్పుడూ అదే చేస్తామని ఫిరంగీ మహాలి అన్నారు. మరోవైపు..
వ్యాక్సిన్ హలాలే.. హరామ్ కాదు
కరోనా వ్యాక్సిన్లలో పంది మాంసం వాడకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, ప్రముఖ ఫార్మా కంపెనీలు వరుస ప్రకటనలు చేశాయి. తమ కరోనా వైరస్ వ్యాక్సిన్లలో పంది మాంసంతో చేసిన ఉత్పత్తులను వాడలేదని ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా సంస్థ అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే సదరు వ్యాక్సిన్లలో జెలటిన్ లేదని ఇప్పటి వరకూ ఎవరూ ధృవీకరించక పోవడం విచిత్రం. ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా ఇండోనేషియాలాంటి ముస్లిం దేశాలకు ఇలాంటి ధృవీకరణ లేకుండానే ఈ సంస్థలు వ్యాక్సిన్లను పంపించనున్నాయి.
మీకు గుర్తుందిగా.. జనవరి 1 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు -ఫోన్ నంబర్కు ముందు 0 తప్పదు