మోడీకి ఆహ్వానం, కాశ్మీర్పై జోక్యం చేసుకోం: కామెరూన్
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ కాశ్మీర్ విషయంపై తాము ఎట్టి పరిస్ధితుల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంగ్ల ఛానల్ 'సీఎన్ఎన్-ఐబీఎన్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆతిథ్యం ఇచ్చేందుకు బ్రిటన్ చాలా ఆసక్తితో ఎదురుచూస్తోందన్న డేవిడ్ కామెరూన్ మాట్లాడుతూ, మోడీ తమ దేశానికి రావాలని బహిరంగంగా ఆహ్వానించారు. "మోడీకి మా దేశం తరపున బహిరంగ ఆహ్వానం ఉంది. మా డిప్యూటీ పీఎం, ఛాన్సెలర్, విదేశాంగ మంత్రి అందరూ భారత్కు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.
నేను కూడా మూడుసార్లు ప్రధాని హోదాలో ఇండియాలో పర్యటించాను. భవిష్యత్తులోనూ పర్యటించాలని ఆశిస్తున్నా. బ్రిటన్ వచ్చేందుకు భారత్ ప్రధానమంత్రికి బహిరంగంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఆయన వస్తే సాదరంగా ఆహ్వానిస్తాం" అని కామెరూన్ పేర్కొన్నారు.
ఇక కాశ్మీర్ అంశంపై మాట్లాడుతూ అది కేవలం భారత్ - పాకిస్ధాన్ మధ్య విషయమని, దానిపై తాము ఎట్టి పరిస్ధితుల్లో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు భిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే భాగంలో లండన్ నగరంలోని ప్రఖ్యాత డౌనింగ్ స్ట్రీట్లోని ట్రఫాల్గర్ స్క్వేర్ వద్ద మిలియన్ మార్చ్ పేరిట భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
ఇందులో పాల్గొని కాశ్మీర్ అంశంపై ప్రసంగించాలని బిలావల్ భుట్టో వేదిక వద్దరు చేరుకున్నారు. వేదికపైకి చేరుకుని బిలావల్ తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే భుట్టోపై పాకిస్థానీలే దాడికి దిగారు. ట్రవల్గార్ స్కేర్లోని వేదికపైకి భుట్టో చేరుకోగానే పాకిస్ధానీయులే ప్లాస్టిక్ సీసాలు, క్యాన్లు విసిరిన విషయం తెలిసిందే.
దీంతో ఈ మిలియన్ మార్చ్ విఫలమైంది. భారత్కు వ్యతిరేకంగా కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చే లక్ష్యంతో నిర్వహించిన ఈ మిలియన్ మార్చ్ పాకిస్ధాన్ అంతర్గత రాజకీయ సంక్షోభంగా మారింది. దీంతో ఈ వైఫల్యానికి కారణం మీరంటే మీరేనంటూ బిలావల్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వర్గాలు ఆరోపించుకున్నాయి.
ఇప్పుడు స్వయంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా పాకిస్ధాన్కు మద్దతు చెప్పకపోడవంతో ఆ దేశ నాయుకులు తీవ్ర నిరాశతో ఉన్నారని సమాచారం.