ముషారఫ్ ఇక స్వేచ్ఛా జీవి: మరణ శిక్ష తీర్పును కొట్టేసిన లాహోర్ కోర్టు
లాహోర్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు లాహోర్ కోర్టులో భారీ ఊరట లభించింది. ముషారఫ్కు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. ముషారఫ్ కేసు విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది.
మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ తరపు న్యాయవాది వేసిన పిటిషన్ను లాహోర్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ముషారఫ్పై నమోదు చేసిన దేశ ద్రోహం కేసు చట్ట నిబంధనల ప్రకారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం ముషారఫ్ కు ఎటువంటి శిక్ష లేదని, ఇప్పుడు ఆయన స్వేచ్ఛా జీవి అని అతని తరపు న్యాయవాది ఒకరు తెలిపారు. కాగా, గత డిసెంబర్ నెలలో ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
2013లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) ప్రభుత్వం ముషారఫ్పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. 2007 నవంబర్ 3న రాజ్యాంగాన్ని రద్దుచేసి, ఎమర్జెన్సీ పాలన విధించడంతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. దీంతో పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును విచారించి తీర్పును వెలువరించింది.
కాగా, డిసెంబర్ 17 నాటికి ఇరు వైపులా వాదనలు పూర్తైనా, కాకపోయినా తుది తీర్పు వెలువరిస్తామని ప్రత్యేక కోర్టు ఇంతకు ముందే స్పష్టం చేసింది. దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న ముషారఫ్ను 2014 లో అభిశంసించారు. అప్పటి నుండి నుంచి విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్కు తిరిగి వచ్చినా.. అనారోగ్యం కారణంగా తిరిగి దుబాయ్ వెళ్లారు ముషారఫ్.