వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లో డాలర్ కొరత... ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాకిస్తాన్

పాకిస్తాన్‌లో ప్రస్తుతం డాలర్ల కొరత తీవ్రంగా ఉంది. దిగుమతులు చేసుకున్న సరుకుల క్లియరెన్స్‌ కోసం కూడా డాలర్లు అందుబాటులో లేవు.

దేశంలోకి డాలర్ వచ్చే మార్గాలు తగ్గిపోతున్నాయి. విదేశీ రుణాల చెల్లింపు కారణంగా విదేశీ మారక ద్రవ్య నిధులు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయాయి.

దిగుమతి చేసుకున్న సరుకులకు క్లియరెన్స్ దొరకడంలో ఎదురైన ఇబ్బందులతో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని కైజర్ వహీద్ కొన్ని వారాల పాటు చాలా కష్టపడ్డారు.

యాంటీ బయాటిక్ ఔషధాల తయారీలో ఉపయోగించే ముడిసరుకు దిగుమతి చేసుకున్నట్లు, క్లియరెన్స్ దొరక్కపోవడంతో ముడిసరుకు 15-20 రోజులు ఓడరేవులోనే ఉండిపోయిందని ఆయన తెలిపారు.

''దిగుమతి చేసుకున్న సరుకుకు సంబంధించిన ఎల్‌సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) వచ్చింది. కానీ, ఈ ఎల్‌సీ చెల్లింపు కోసం బ్యాంకు నుంచి డాలర్లు లభించలేదు. సరుకును ఎగుమతి చేసిన విదేశీ డీలర్, తన డబ్బులు చెల్లించాల్సిందిగా పదే పదే అడుగుతున్నారు. వారికి చెల్లించాల్సిన నగదును నేను బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఇప్పుడు బ్యాంక్ ఆ మొత్తాన్ని విదేశీ డాలర్ల రూపంలో వారికి పంపించాల్సి ఉంది. కానీ, బ్యాంకు డాలర్లను పంపించడం లేదు.

పాకిస్తాన్

ఈ కారణంగా దిగుమతి చేసుకున్న ముడిసరుకుకు క్లియరెన్స్ దొరకలేదు. దాని కోసం నేను కష్టపడ్డాను.

ఔషధాల తయారీలో వాడే ముడిసరుకు ఎక్కువగా లవణం రూపంలో ఉంటుంది. అది పాడవ్వకుండా ఉండాలంటే నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచాల్సి ఉంటుంది. కానీ, సరుకు దిగుమతి అయిన 15-20 రోజుల తర్వాత విక్రేతకు డాలర్లు పంపగలిగాను. దాని తర్వాత నా సరుకుకు క్లియరెన్స్ లభించింది. ఈలోగా సరుకు కొంత పాడైంది. నేను ఆ నష్టాన్ని భరించుకోవాల్సి వచ్చింది’’ అని ఆయన వివరించారు.

డాలర్లు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కైజర్ మాట్లాడుతూ... ''ఇప్పుడు డాలర్లు దొరకడం చాలా కష్టంగా మారింది. చాలా బ్యాంకులు డాలర్లు ఇవ్వడానికి సిద్ధంగా లేవు’’ అని అన్నారు.

ఫార్మాస్యూటికల్ రంగంలో కైజర్‌కు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురుకాలేదు. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ఉన్న నాలుగు కంటే ఎక్కువ కంటైనర్లు చాలా రోజులుగా క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటికి ఎల్‌సీ సిద్ధంగా ఉన్నప్పటికీ బ్యాంకు నుంచి డాలర్ల రూపంలో చెల్లింపులు పూర్తి కాలేదు.

పాకిస్తాన్

ఈ పరిస్థితిని వివరిస్తూ పండ్లు, కూరగాయల వ్యాపారుల సంఘం తరఫున వాణిజ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి వాటికి క్లియరెన్స్ లభించింది.

వంటనూనెల రంగంలో పనిచేసే షేక్ ఉమర్ రెహాన్ కూడా ఈ అంశం గురించి మాట్లాడారు.

''దిగుమతి చేసుకునే వంటనూనెల ఎల్‌సీ చెల్లింపు అనేది ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి. ఎందుకంటే దేశంలో వంటనూనె కొరత తలెత్తకూడదని దీన్ని ఆ జాబితాలో చేర్చారు. అయినప్పటికీ, వాటికి క్లియరెన్స్ దక్కడంలో ఆలస్యం జరుగుతోంది’’ అని ఆయన చెప్పారు.

అలాగే, ఒక స్థానిక రిఫైనరీ క్రూడాయిల్ కోసం విదేశాలకు తన ట్యాంకర్‌ను పంపగా, బ్యాంకు నుంచి సగం ట్యాంకర్‌కు మాత్రమే ఎల్‌సీ ఇచ్చారు. రిఫైనర్ మొత్తం ట్యాంకర్ కోసం చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. కానీ, బ్యాంకు నుంచి సగం డబ్బులే అందడంతో వారు క్రూడాయిల్, సగం ట్యాంకర్ మాత్రమే పంపించారు.

పాకిస్తాన్‌లో దిగుమతి కార్గో కోసం ఎల్‌సీ తెరవకపోడం లేదా వాటి చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. డాలర్ల కొరత కారణంగా దిగుమతుల కార్గోకు క్లియరెన్స్ దక్కడం లేదు.

పాకిస్తాన్

డాలర్ ధరపై ఇషాక్ దార్ ఏమన్నారు?

పాకిస్తాన్‌లో ప్రస్తుతం డాలర్ ధర, దాని లభ్యత అతిపెద్ద సమస్యగా మారింది.

డాలర్ ధరను నియంత్రించడంలో పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాన్ దార్ విఫలమైనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఓవైపు ప్రభుత్వ డాలర్ రేటు 224-225 రూపాయలకు చేరుకుంది. మరోవైపు డాలర్ల కోసం బ్యాంకులకు వెళ్తే అక్కడ వాటి లభ్యత లేదు. ఇక గ్రే మార్కెట్‌లో డాలర్ ధర 240 రూపాయల పైనే ఉంది.

మిఫ్తా ఇస్మాయిల్ పాకిస్తాన్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డాలర్ రేటులో పెరుగుదల కనిపించింది. 2022 జూలై 29 నాటికి రూపాయితో డాలర్ మారకం రేటు 240 వరకు చేరుకుంది. దీంతో మిఫ్తా ఇస్మాయిల్‌పై విమర్శలు వచ్చాయి.

ఈ ఏడాది సెప్టెంబరు చివరలో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఇషాక్ దార్ BBCతో మాట్లాడుతూ... స్థానిక కరెన్సీని బలోపేతం చేయడం తన ప్రాధాన్యతల్లో ఒకటని అన్నారు.

పాకిస్తాన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డాలర్ విలువను 200 రూపాయల కంటే దిగువకు తీసుకొస్తానని అక్టోబర్ నెలలో ఆయన ప్రకటించారు.

ఇషాక్ దార్ ఈ ప్రకటన చేసి రెండు నెలలు గడిచినా కూడా డాలర్ ధర రూ. 200 కంటే తగ్గకపోగా రూ. 224కి చేరుకుంది. అయితే, బహిరంగ మార్కెట్‌లో డాలర్ ధర రూ. 230 కంటే ఎక్కువగా ఉంది.

డాలర్లు అందుబాటులో లేకపోవడమే ఇక్కడ పెద్ద సమస్య. దీని కారణంగా బ్యాంకులు, ఎల్‌సీకి తగిన డాలర్లు చెల్లించకపోవడంతో దేశంలోకి దిగుమతి చేసుకున్న ముడి చమురు, వంటనూనె, ఔషధాలు... ఎగుమతి రంగానికి చెందిన ముడిసరుకు, యంత్రాలు, మొక్కలు... ఇతర రంగాలకు సంబంధించిన దిగుమతి సరుకులు ఓడరేవుల్లోనే రోజుల తరబడి ఉంటున్నాయి.

పాకిస్తాన్

ఇషాక్ దార్ గత పదవీకాలంలో డాలర్ పరిస్థితి ఏంటి?

ఇషాక్ దార్, తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు డాలర్‌ ధరను ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచారు. అయితే, డాలర్ ధర నియంత్రణకు ఆయన తీసుకున్న చర్యలను కృత్తిమ మార్గాలుగా రాజకీయ ప్రత్యర్థులు, నిష్పాక్షిక ఆర్థిక నిపుణులు అభివర్ణించారు.

ఇషాక్ దార్, డాలర్ రేటును మ్యానిపులేట్ చేశాడని తాను చెప్పలేనని బీబీసీతో ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, జర్నలిస్ట్ ఖుర్రామ్ హుస్సేన్ అన్నారు.

అయితే, గత పదవీకాలంలో ఆయన డాలర్ రేటును మేనేజ్ చేశారని చెప్పగలనని అన్నారు.

దీని గురించి మరో ఆర్థిక నిపుణుడు, సిటీ బ్యాంకులో గతంలో పనిచేసిన యూసుఫ్ నాజర్ కూడా బీబీసీతో మాట్లాడారు.

''గత పదవీకాలంలో ఇషాక్ దార్, డాలర్ ధరను నియంత్రించారని చెప్పడం తప్పు. ఆ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది ఆయనకు కలిసొచ్చింది. చమురు కొనుగోలుకు తక్కువ డాలర్లు ఖర్చు చేయడం వల్ల పాకిస్తాన్‌కు ఆ ప్రయోజనం దక్కింది.

అంతే కాకుండా అప్పట్లో ఐఎంఎఫ్ వైఖరి కూడా మెతకగా ఉండేది. దీనివల్ల పాక్ లాభపడంది. అందువల్ల దేశంలో డాలర్ రేటు పెరగలేదు’’ అని ఆయన వివరించారు.

డాలర్ రేటు ఇప్పుడు ఎందుకు తగ్గట్లేదు?

డాలర్ రేటు తగ్గకపోవడానికి కారణం పాకిస్తాన్ వద్ద సరిపడా విదేశీ మారక ద్రవ్యం లేకపోవడమే అని ఖుర్రం హుస్సేన్ అన్నారు.

''ప్రస్తుతం డాలర్ రేటును తగ్గించాలంటే దేశంలోకి డాలర్లను తీసుకురావడం ఒక్కటే మార్గం. ప్రస్తుతం దేశంలోకి డాలర్లు ఎక్కడి నుంచి కూడా రావట్లేదు’’ అని చెప్పారు.

పాకిస్తాన్ దివాలా అంచుల్లో ఉందనే వాదనను ఆయన తోసి పుచ్చారు. ''ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ గణాంకాల ప్రకారం, పాకిస్తాన్ దగ్గర 6.7 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంది. దేశం మొత్తంగా చూస్తే ఇది 12.6 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ చెల్లింపులు చేయాల్సి ఉంది. మరోవైపు దేశంలోకి డాలర్లను తీసుకువచ్చే మూడు ముఖ్య వనరులైన ఎగుమతులు, రెమిటెన్స్‌లు, విదేశీ మూలధన పెట్టుబడులు గత కొన్ని నెలలుగా ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.

డాలర్ రేటును తగ్గించాలనడం రాజకీయ నినాదమా?

పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్, డాలర్ రేటును తగ్గిస్తామని చెప్పడం కేవలం ఒక రాజకీయ నినాదమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆయన చెప్పినదానికి, గ్రౌండ్ రియాలిటీకి అసలు సంబంధమే లేదని చెబుతున్నారు.

ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటన గురించి యూసుఫ్ నాజర్ మాట్లాడారు.

''పాకిస్తాన్‌కు తిరిగి రావాలని, తన గత హోదాను తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఇషాక్ ఆ ప్రకటన చేశారు.

పెరుగుతున్న డాలర్ రేటు ప్రభావం అత్యధికంగా సామాన్యులపై ఉంటుంది. వారు మరింత ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా పారిశ్రామిక రంగంలో ఉద్యోగాల కోత ఉండొచ్చు. ఈ చర్య నిరుద్యోగాన్ని పెంచుతుంది’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Dollar shortage in Pakistan... How will it affect the economy?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X