జో బిడెన్ గెలిస్తే..: భారత్ భవిష్యత్పై ట్రంప్ కుమారుడు సంచలనం: మోడీతో సంబంధాలపైనా
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో ఎన్నికల ర్యాలీలు ఊపందుకున్నాయి. అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించడానికి రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల నేతలు ప్రచారపర్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వరుసగా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థిగా జో బిడెన్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదే పార్టీ తరఫున భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవి కోసం బరిలో నిల్చున్నారు.

భారత ఓటర్లకు గాలం..
అమెరికాలో భారీ సంఖ్యలో స్థిరపడిన భారతీయుల ఓట్ల కోసం ఈ రెండు పార్టీలూ గాలం వేస్తున్నాయి. భారత్-అమెరికా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను తమ ప్రచార పర్వంలో ఉటంకిస్తున్నాయి. తాజాగా- డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్.. భారత ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. తండ్రి తరఫున ప్రచారం చేస్తోన్న ఆయన న్యూయార్క్లో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సెమినార్లో పాల్గొన్నారు. భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికే ప్రస్తుత ప్రభుత్వం మొగ్గు చూపుతోందని, ప్రభుత్వం మారితే.. విఘాతం కలిగే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు.

మోడీ-ట్రంప్ జోడీపై
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య అద్వితీయమైన సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ రెండు దేశాలు లబ్ది పొందేలా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో అవి మరింత బలోపేతం కావాలంటే.. ఇప్పుడున్న ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలోో తన తండ్రి భారత పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆయన లభించిన స్వాగత సత్కారాలు.. తనను ఆశ్చర్యానికి గురి చేశాయని డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వ్యాఖ్యానించారు.

సోషలిజం.. కమ్యూనిజం మధ్య..
ప్రస్తుతం అమెరికాలో సోషలిజం, కమ్యూనిజం మధ్య ఎన్నికల పోరాటం సాగుతోందని వ్యాఖ్యానించారు. సోషలిజం, కమ్యూనిజం..ఈ రెండింట్లో ఏది గెలిచినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ట్రంప్ జూనియర్ అంచనా వేశారు. తన తండ్రి మరోసారి అధికారంలోకి ఎక్కితే.. సోషలిజం వర్ధిల్లుతుందని చెప్పుకొచ్చారు. కమ్యూనిజానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న జో బిడెన్ గెలవడమంటూ జరిగితే.. అది భారత్కు పెనుముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదని ట్రంప్ జూనియర్ హెచ్చరించారు. జో బిడెన్.. చైనాకు సానుకూలంగా వ్యవహరిస్తారని, దాని ప్రభావం భారత్పై తీవ్రంగా పడుతుందని అన్నారు.

బిడెన్ కుమారుడికి ఒకటిన్నర బిలియన్ డాలర్లు..
జో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్కు చైనా నుంచి ఒకటిన్నర బిలియన్ డాలర్ల నిధులు అందాయని ట్రంప్ జూనియర్ ఆరోపించారు. జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడమంటూ జరిగితే.. భారత్ పెనుముప్పును ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. ఆ ముప్పు కూడా చైనా నుంచే ఎదురవుతుందని చెప్పారు. అలాంటి పరిణామాలను అమెరికాలోని భారతీయులు కొని తెచ్చుకోబోరని తాను ఆశిస్తున్నానని అన్నారు. ఆసియాలో భారత్ అత్యంత శక్తిమంతంగా ఎదగడానికి అమెరికా సహాయ, సహకారాలను అందిస్తుందనే విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications