భారత్పై ట్రంప్ టారిఫ్ బాంబ్!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.
భారత్ తమకు మిత్ర దేశమే అయినప్పటికీ.. గత అనేక సంవత్సరాలుగా భారత్తో తమ వ్యాపారం సాపేక్షంగా తక్కువగా ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీనికి కారణం భారత సుంకాలు చాలా ఎక్కువగా ఉండటమేనని.. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు భారత్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఇది అమెరికాకు వ్యాపారాన్ని పెంచడంలో అడ్డుపడుతుందని ట్రంప్ వివరించారు.

అంతేకాకుండా భారత్ నిరంతరం రష్యా నుండి సైనిక పరికరాలను కొనుగోలు చేస్తోందని, ఇది సరైనది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యా ఉక్రెయిన్పై దాడిని ఆపాలని అందరూ కోరుకుంటున్నప్పటికీ.. భారత్ రష్యాతో వ్యాపారాన్ని నిరంతరం పెంచుతోందని, ఇది సరైన చర్య కాదని ఆయన అన్నారు. ఈ అన్ని కారణాలను పరిగణనలోకి తీసుకుని, అమెరికా భారత్పై 25 శాతం సుంకాలు విధించాలని నిర్ణయించిందని, అవి ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికాకు భారతదేశ ఎగుమతులు 22.8 శాతం పెరిగి 25.51 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. దిగుమతులు 11.68 శాతం పెరిగి 12.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications