H-1B వీసా: భారత ఐటీ ఉద్యోగులకు దుర్వార్త
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలోకి దిగాలని కోరుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించే కొత్త విధానం భారత ఐటీ ఉద్యోగులకు చేదు వార్త కానుంది. అమెరికాలో ఉన్న నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలను కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డ ఆయన హెచ్-1బి వీసాలపై దేశంలోకి వస్తున్న వారి కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలా చేయడం వల్ల అమెరికన్ కంపెనీలు తక్కువ ధరకే ఉపాధి పొందుతున్న విదేశీ ఉద్యోగుల జోలికి పోకుండా, అమెరికన్లకే అవకాశాలు కల్పిస్తారనేది ఆయన అలోచన. ఇది గనుక అమలైతే నిరుద్యోగ అమెరికన్లకు ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాల కోసం ఇండియాతో పాటు విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గుతుందని తెలిపారు.
హెచ్ 1బీ వీసాల సంఖ్యను మూడు రెట్లు పెంచాలన్న ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, ఫ్లోరిడా సెనెటార్ మార్కో రుబియోలు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికా చేపట్టాల్సిన ఇమిగ్రేషన్ సంస్కరణల్లో కనీస వేతన పెంపు ఎంతో ముఖ్యమైందని న్యూయార్క్కు చెందిన రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.