మోదీతో మాట్లాడటమా?.. నెవ్వర్
టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తోన్నందున భారత్ పై కొరడా ఝుళిపిస్తోన్నారు. క్రమంగా ఇది రెండు దేశాల మధ్య తీవ్ర అగాథాన్ని సృష్టిస్తోంది. దౌత్య సంబంధాలు దెబ్బతినేంత వరకూ వెళ్లిందీ పరిస్థితి.
రష్యాను డొనాల్డ్ ట్రంప్ బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా భారత్ పై 50 శాతం టారిఫ్ భారం పడింది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.
తాజాగా భారత్ తో ట్రేడింగ్ చర్చలపై మరోసారి తన వైఖరిని బయటపెట్టారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ అంశంపై భారత్ తో గానీ.. ఆ దేశ ప్రతినిధులతో గానీ చర్చించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించుకునేంత వరకూ భారత్ తో ఎటువంటి ట్రేడ్ నెగోషియేష్స్ కూడా ఉండబోవని స్పష్టం చేశారు.
వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ కు చెందిన న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. 50 శాతం టారిఫ్ విధించిన నేపథ్యంలో దీన్ని సవరించేలా భారత్ తో చర్చలు ఉంటాయని ఆశిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు- సమస్యను పరిష్కరించుకునేంత అటువంటిదేమీ ఉండబోదని అన్నారు.
రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ ను దిగుమతి చేసుకోవడాన్ని తమ దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తోన్నారు డొనాల్డ్ ట్రంప్. భారత్ సహా ఆయా దేశాలు పెద్ద మొత్తంలో క్రూడాయిల్ ను కొనుగోలు చేసుకుంటోన్నందున రష్యా ఆర్థికంగా బలోపేతమౌతోందని, అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకుంటోందని భావిస్తోంది.
అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించిన విషయం తెలిసిందే. దేశంలో వివిధ వర్గాల ప్రజలు.. ప్రత్యేకించి రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడబోమని, అదనపు టారిఫ్ భారాన్ని మోయడానికీ వెనుకాడబోమనీ చెప్పారు.












Click it and Unblock the Notifications