అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!
త్వరలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది అమెరికా. 250వ ఇండిపెండెన్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ దేశ పేపర్ కరెన్సీలో కీలక మార్పులు చోటు చేసుకునున్నాయి. ఈ విషయాన్ని యూఎస్ ట్రెజరీ డిపార్ట్ మెంట్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా డాలర్ నోట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కనిపించబోతోంది. ఓ అధ్యక్షుడు తాను పదవిలో ఉండగా కరెన్సీపై సంతకం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి.
తన పేరును ప్రభుత్వ సంస్థలపై ముద్రించుకోవడంలో ట్రంప్ చూపిన ఆసక్తికి ఇది తాజా నిదర్శనం. ఇప్పటివరకు అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరీ సెక్రటరీ, కోశాధికారి సంతకాలు మాత్రమే ఉండేవి. ఒక డాలర్, రెండు డాలర్లు, అయిదు డాలర్లు, 10 డాలర్లు, 20 డాలర్లు, 50 డాలర్లు, 100 డాలర్ల డినామినేషన్లలో ఈ నోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త మార్పు ట్రంప్ పేరును ఈ నోట్లపై శాశ్వతం చేయాలని ట్రెజరీ డిపార్ట్ మెంట్ నిర్ణయించింది.

ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అపూర్వ ఆర్థిక వృద్ధి, ద్రవ్య బలం, స్థిరత్వం వైపు డొనాల్డ్ ట్రంప్ నడిపించారని బెసెంట్ వ్యాఖ్యానించారు. ఆయా డినామినేష్ నోట్లపై ఆయన సంతకం.. చారిత్రక విజయాలకు శాశ్వత గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో నమోదైన ఆర్థిక వృద్ధిరేటు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కంటే అధికమని, కోవిడ్ అనంతర పోకడలను పోలి ఉందని చెప్పారు.
యూఎస్ ప్రభుత్వ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ కూడా దీన్ని సమర్థించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు స్వర్ణయుగంగా మార్చారని ప్రశంసించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థ రూపకర్తగా ట్రంప్ చరిత్రలో తనదైన ముద్ర వేశారని ఆయన వెల్లడించారు. కరెన్సీపై ఆయన సంతకం ముద్రించడం సముచితం, అర్హమైనదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2025లో అమెరికా స్థూల దేశీయోత్పత్తి 2.2 శాతం పెరిగింది. ఇది 2022-2024 మధ్య కాలంలో నమోదైన సగటు 2.5 శాతం వృద్ధిని స్వల్పంగా అధిగమించినప్పటికీ, పెద్దగా వ్యత్యాసం లేదు.
ఈ నేపథ్యంలో 2028 అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరపున కీలక అభ్యర్థిగా భావిస్తున్న కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ట్రెజరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. చట్టంలోని లొసుగును ఉపయోగించుకుని జీవించి ఉన్న అధ్యక్షుల సంతకాన్ని ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీపై ముద్రించడం అనేది నిబంధనలకు విరుద్ధమని అన్నారు.












Click it and Unblock the Notifications