శాంతిదూతగా ప్రధాని మోదీ..!!
మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా సాగుతోన్న యుద్ధానికి అంతు ఉండట్లేదు. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధానికి బ్రేకులు పడట్లేదు. నెలల తరబడి నిరాటంకంగా కొనసాగుతూనే వస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి.

ప్రతిఘటన..
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని కీవ్ను చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. కీవ్పై రష్యా సైనిక దాడిని ఉక్రెయిన్ తిప్పికొడుతోంది.

జైశంకర్ రష్యా పర్యటన..
ఈ పరిణామాల మధ్య విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్.. రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన మాస్కోలో పర్యటించనున్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సహా పలువురు ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. రష్యన్ ఫెడరేషన్ ఉప ప్రధానమంత్రి డెనిస్ మంతురోవ్ను కలుసుకోనున్నారు. వాణిజ్యం, ఆర్థికం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్తో సమావేశం కానున్నారు.

తొలిసారిగా..
ఉక్రెయిన్పై దండెత్తిన తరువాత జైశంకర్ రష్యా పర్యటనకు వెళ్లబోతోండటం ఇదే తొలిసారి కావడంతో అందరి దృష్టీ ఆయన పర్యటన మీదే నిలిచింది. భారత్-రష్యా మధ్య సుదీర్ఘకాలంగా స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మాస్కో వెళ్లబోతోండటం అందరి దృష్టినీ ఆకర్షించింది.

నిశిత పరిశీలన..
సుబ్రహ్మణ్యం జైశంకర్ రష్యా పర్యటన నేపథ్యంలో- పలు అంశాలు తెర మీదికి వస్తోన్నాయి. ఆయన పర్యటనను పలు దేశాలు నిశితంగా పరిశీలిస్తోన్నాయి. వివిధ దేశాల విదేశాంగ మంత్రులు, ఈ రంగానికి చెందిన నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తోన్నారు. ఎవ్వరి మాట వినకుండా యుద్ధాన్ని కొనసాగిస్తూ వస్తోన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను భారత్ మాత్రమే ఒప్పించగలదనే భావన అందరిలోనూ నెలకొని ఉంది.

మధ్యవర్తిత్వం..
నెలల తరబడి కొనసాగుతూ వస్తోన్న రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పడానికి అవసరమైన చర్యలను భారత్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నిలువరించడంలో భారత్ కీలక పాత్ర పోషించడానికి ఇదే సరైన సమయంటూ నిపుణులు విశ్లేషిస్తోన్నారు. ఈ రెండు దేశాల మధ్యయ శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి భారత్ మాత్రమే కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తోన్నారు.

చర్చల ప్రక్రియ పునరుద్ధరణ..
జైశంకర్ రష్యా పర్యటన నేపథ్యంలో- ది న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వివిధ దేశాలకు చెందిన విదేశాంగ నిపుణుల అభిప్రాయాలను ప్రచురించింది. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించడానికి అవసరమైన చర్చల ప్రక్రియను పునరుద్ధరించగల సామర్థ్యం భారత్కు మాత్రమే ఉన్నట్లు విదేశాంగ నిపుణులు స్పష్టం చేస్తోన్నట్లు పేర్కొంది.

దిగిరాని పుతిన్..
ఉక్రెయిన్తో శాంతి చర్చలను పునరుద్ధరించడానికి వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించట్లేదు. ఈ విషయంలో ఆయన దేన్నీ లెక్కచేయట్లేదు. చర్చల ప్రక్రియను పునరుద్ధరించడానికి పుతిన్ అంగీకరించకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్యగా భావిస్తోన్నారు. ఈ విషయంలో ఆయనను ఒప్పించ సామర్థ్యం భారత్కు ఉందని ఆసియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ జెఫ్ ఎమ్ స్మిత్ చెప్పారు. ఇదివరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ప్రతిపాదన చేసినప్పటికీ దీన్ని పుతిన్ అంగీకరించలేదని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications