ఇండోనేషియా, జపాన్ను వణికించిన భూకంపం
భారీ భూకంపంతో ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. యందేనా ఐలాండ్లోని సోలంకీ సముద్ర తీరం వద్ద ఆదివారం రాత్రి 10.05గంటల సమయంలో ఈ భూప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా రికార్డైంది. యాంబస్కు దక్షిణాన 321 కిలోమీటర్ల దూరంలో బండా సముద్ర తీరం వద్ద భూమికి 214 కి.మీ.ల లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
భూప్రకంపనలు 30 సెకన్ల కన్నా ఎక్కువ సేపు కొనసాగాయి. భారీ భూకంపం కావడంతో ప్రజలందరూ భయంతో ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ వచ్చే అవకాశమున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ భూకంపం కారణంగా కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి ఇంకా వివరాలు తెలియలేదు.
అటు జపాన్ను సైతం భూకంపం వణికించింది. సోమవారం ఉదయం 9.16గంటల సమయంలో 5.5 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. చిబాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సెంట్రల్ టోక్యో పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. సునామీ ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.