శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా: ఆర్థిక సంక్షోభం, భారీ నిరసనల ప్రభావం
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి భారీ ఎత్తున నిరసనలను ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందే, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించారు పాలనాధికారులు.
శ్రీలంక రాజధాని కొలంబోలో సైన్యాన్ని రంగంలోకి దించారు. శ్రీలంకలో రోజురోజుకు పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు పోలీసులు. దేశ రాజధాని కొలంబోలో జరిగిన హింసాత్మక ఘటనలో దాదాపు 23 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కర్ఫ్యూ అమల్లోనే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో.. పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, అధికార నేతల రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష భవనం ఎదుట కూడా భారీ ఎత్తున నిరసనకారులు ఆందోళనలు చేపడుతున్నారు.
Effective immediately I have tendered my resignation as Prime Minister to the President.
— Mahinda Rajapaksa (@PresRajapaksa) May 9, 2022
අගමැති ධූරයෙන් ඉල්ලා අස්වීමේ ලිපිය ජනාධිපතිතුමා වෙත යොමු කළෙමි.
మహింద రాజపక్స రాజీనామాతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడినట్లయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు రావడం లేదు. తప్పులన్నీ చేసి ఇప్పుడు తమకు అధికారం అప్పగిస్తారా? అంటూ నిలదీస్తున్నాయి.