వరద ఎఫెక్ట్, భారత్ టు బంగ్లాదేశ్ జర్నీ: 1700 కి.మీ. నడిచి ఏనుగు మృతి
న్యూఢిల్లీ/ఢాకా: వరదల బీభత్సం కారణంగా మంద నుంచి విడిపోయిన ఓ ఏనుగు ఏకంగా భారత్ నుంచి 1700 కిలో మీటర్లు ఒంటరిగా ప్రయాణించి, బంగ్లాదేశ్కు వెళ్లి మృతి చెందిన సంఘటన అందరిని కంటతడి పెట్టిస్తోంది.
బంగ బహదూర్.. అసోంలోని దుబ్రి జిల్లాలో పెరిగిన ఏనుగు. ఇదంటే ఆ చుట్టు పక్కల గ్రామస్తులందరికీ ఇష్టం. అటువంటి బంగ బహదూర్.. నెలన్నర క్రితం వచ్చిన బ్రహ్మపుత్ర వరదల్లో చిక్కుకుపోయింది. ఆ వరద నీటిలోనే ప్రాణాలు కాపాడుకుంటూ బంగ్లాదేశ్ చేరుకుంది.
ఈ ఏనుగు ఢాకా సమీపంలోని ఓ కొలనులోని మురుగు నీటిలో చిక్కుకుని పైకి రాలేక అవస్థలు పడుతున్న సమయంలో ఆగస్టు 11వ తేదీన చూసిన బంగ్లాదేశ్ అటవీ శాఖ అధికారులు దానిని పార్కుకు తరలించాలి, బతికించేందుకు ప్రయత్నించారు.

ఏమాత్రం సత్తువ లేకుండా నిలబడలేని స్థితిలో కనిపించిన ఏనుగును కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. పెద్ద మొత్తంలో సెలైన్లు పెట్టినప్పటికీ కోలుకోలేకపోయింది. బంగ్లా సఫారీ పార్కుకు తరలించేందుకు మత్తు మందు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ కుదురుకోలేదు.
పదిహేడు వందల కిలోమీటర్లు నడవడం, వరదల ఇబ్బందులు, సరైన ఆహారం లేకపోవడం, బాగా నీరసించిపోవడం వల్ల అది మృతి చెందింది. అంతకుముందు వరద నీటిలో ఏనుగును చూసిన బంగ్లాలోని స్థానిక గ్రామస్తులు దానిని రక్షించేందుకు నీటిలో దూకారు. నాలుగు టన్నుల బరువున్న ఆ ఏనుగు నీటిలో మునగకుండా జాగ్రత్త పడ్డారు.












Click it and Unblock the Notifications