మోదీ సర్కారుకు మరో ఎదురుదెబ్బ.. సీఏఏపై యూరప్ దేశాల సంచలన తీర్మానం.. అంతర్జాతీయంగా ఎఫెక్ట్
దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యవక్తమవుతున్నప్పటికీ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేసేతీరుతామంటోన్న మోదీ సర్కారుకు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులతోపాటు 57 దేశాలు సభ్యులుగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సీఏఏపై ఆందోళన వ్యక్తం చేయగా, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో ఏకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం సంచలనం రేపుతున్నది. ఈ పరిణామాలన్నీ ఇండియా ప్రతిష్టను పలుచనచేయడంతోపాటు పలు దేశాలతో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలపైనా ప్రభావం పడుతుందంటూ తీర్మానంలో సంచలన అంశాలను ప్రస్తావించారు.

సీఏఏతో ప్రమాదకర విభజన
యూరోపియన్ పార్లమెంట్ లో సభ్యులుగా ఉన్న 24 దేశాలకు చెందిన 154 మంది సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వీళ్లంతా డెమోక్రాట్, సోషలిస్టు పార్టీలకు చెందినవాళ్లే కావడం గమనార్హం. భారత ప్రభుత్వం తలపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలు పూర్తిగా వివక్షతో కూడినవని, వీటి వల్ల దేశంలో ప్రమాదకరమైన విభజన తలెత్తుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. జాతి, రంగు, మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడంగానీ, తీసెయ్యడంగానీ చేయరాదన్న అంతర్జాతీయ సూత్రాలు, ఒప్పందాలకు వ్యతిరేకంగా భారత్ వ్యవహరించడం తగదని తీర్మానంలో పేర్కొన్నారు.

నిరసనలపై ఉక్కుపాదమా?
సీఏఏ వ్యతిరేక నిరసనల పట్ల మోడీ సర్కార్ అనుసరిస్తోన్న కఠిన వైఖరిని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యులు తప్పుపట్టారు. నిరసనల్ని నేరంగా చిత్రీకరించేబదులు.. ప్రభుత్వమే పెద్ద మనసు చేసుకుని.. ఆందోళనకారులతో మాట్లాడాలనే సూచనను కూడా తీర్మానంలో పొందుపర్చారు. సీఏఏ, ఎన్ఆర్సీ వల్ల ఇండియాలో లక్షల మంది మైనార్టీలు పౌరసత్వం కోల్పోతారనడంలో ఎలాంటి సందేహానికి తావులేదని తీర్మానం డ్రాఫ్టులో రాసుకొచ్చారు. కాగా, ఈ రకమైన వాదనను మోదీ సర్కార్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

జనవరి 30న ఓటింగ్..
ఈయూ పార్లమెంట్ లో 154 మంది సభ్యులు దాఖలు చేసిన సీఏఏ వ్యతిరేక తీర్మానంపై ఈనెల 29న చర్చ ప్రారంభమవుతుందని, 30న ఓటింగ్ ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 28 దేశాల కలయికగా ఏర్పడిన యురోపియన్ యూనియన్.. బెల్జియం రాజధాని బ్రసెల్స్ కేంద్రంగా పార్లమెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిదే. ఇందులో మొత్తం 751 మంది సభ్యులున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన 154 మంది సోషలిస్ట్, డెమోక్రాట్ పార్టీలకు చెందినవాళ్లే కాబట్టి .. మిగతా సభ్యుల మద్దతు ఉంటుందా? ఉండదా? అనేది సందిగ్ధంగా మారింది. అమెరికాలో హౌజ్ రిప్రెజెంటేటివ్ అయిన పరిమళా జయపాల్, రషీదాలు సీఏఏకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్మానంపై సెనేట్ లో చర్చ జరగకుండానే బుట్టదాఖలైంది.

సీఏఏతో ఎవరికీ నష్టం రాదు..
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లో మతపరమైన దాడులు, వివక్ష తట్టుకోలేక ఇండియాకు శరణార్థులుగా వచ్చినవారికి పౌరసత్వ కల్పించడమే సీఏఏ ఉద్దేశమని, దాని వల్లే భారత పౌరులెవరికీ నష్టం వాటిల్లదని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే మత ప్రాతిపదికన పౌరసత్వ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షపార్టీలు, ప్రజాసమూహాలు డిమాండ్ చేస్తున్నాయి. యురోపియన్ యూనియన్ పార్లమెంట్ లో సీఏఏ వ్యతిరేక తీర్మానంపై భారత ప్రభుత్వం స్పందించాల్సిఉంది.












Click it and Unblock the Notifications