ఖరీదైన కార్లలో వచ్చిన 21 మంది.. ఏం పని చేస్తున్నారో తెలుసా?
బహ్రైన్లోని మనామాలో ఒకే కుటుంబానికి చెందిన 21 మంది బిక్షాటన చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. విచిత్రం ఏమిటంటే.. వీళ్లంతా ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో నివసిస్తూ.. ఖరీదైన కార్లలో తిరుగుతుండడం.
మనామా: రోడ్డుపై వెళుతున్నప్పుడు చౌరస్తాల వద్ద భిక్షాటన చేసుకునే వాళ్లని చూసి మనం జాలిపడతాం. పాపం.. ఎండకు ఎండి, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఉండే ఆ స్థితి పగవాళ్లకు కూడా రాకూడదని మనం కోరుకుంటాం.
కానీ ఓ యాచక కుటుంబం మాత్రం మన తలపులను తలకిందులు చేస్తోంది. భిక్షాటన చేస్తూ బతుకుతున్న ఈ కుటుంబం గురించి పోలీసులు చెబుతున్న వివరాల వింటే మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం.
ఒకే కుటుంబానికి చెందిన 21 మంది బిక్షాటన చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అరె, బిక్షాటన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని సందేహిస్తున్నారా? పూర్తిగా చదవండి మీకే అర్థమవుతుంది.
ఒకే కుటుంబానికి చెందిన ఈ భిక్షగాళ్లకు ఖరీదైన 5 కార్లు ఉన్నాయి. ఈ కార్లలో అత్యంత విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ సెడాన్ కారు కూడా ఉంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి ఖరీదైన ఓ అపార్ట్మెంటులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
ఉదయాన్నే కార్లలో బయలుదేరే వీళ్లు రోడ్ల వెంట కార్లను ఆపుతూ అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నామని, డబ్బు అవసరమని, దానం చేయాలంటూ కోరతారు. వీరి భాగోతాలను పసిగట్టిన పోలీసులు కుటుంబానికి చెందిన 21 మందిని అరెస్టు చేశారు. వారి తతంగాన్ని బయటపెట్టారు.
నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని, అక్రమంగా బిక్షాటన చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని బహ్రైన్లోని మనామాలో ఉన్న అల్ ఖాసీం ప్రాంత పోలీసు బదీర్ అల్ సుహేబానీ అనే అధికారి తెలిపారు.
నిందితుల్లో ఒక మహిళ, పలువురు చిన్న పిల్లలు ఉన్నారని, వీరివద్ద భారీగా డబ్బు, నగదు ఉన్నాయని తెలిపారు. ఈ భిక్షగాళ్ల విలాస జీవితం గురించి తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు. డబ్బు సంపాదించడం కోసం అనేకమంది గల్ఫ్ దేశాల్లో యాచకులుగా బతుకుతున్నారని అభిప్రాయపడుతున్నారు.