Donald Trump : కాసేపట్లో లొంగిపోనున్న డొనాల్డ్ ట్రంప్-అధ్యక్ష ఎన్నికల పోటీపై ప్రభావం !
2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడన్ కు అనుకూలంగా వచ్చిన ఫలితాన్ని తారుమారు చేసేందుకు యత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ జైల్లో లొంగిపోతున్నారు. ఇప్పటికే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ట్రంప్ లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే యూఎస్ అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ల తరఫు అభ్యర్ధిగా తొలి స్ధానంలో ఉన్న ట్రంప్ కు ఈ కేసు తలనొప్పిగా మారే ప్రమాదం లేకపోలేదు.
అమెరికా చట్టాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ లొంగిపోయిన తర్వాత ఏం జరగబోతోందన్న చర్చ తెరపైకి వస్తోంది. ట్రంప్ ఇవాళ ఫుల్టన్ కౌంటీ జైల్లో లొంగిపోయిన తర్వాత అక్కడి అధికారులకు వాస్తవంగా జరిగిందేంటో క్లుప్తంగా వివరిస్తారు. అక్కడ అధికారులు ట్రంప్ వాంగ్మూలం ఆధారంగా కేసు తదుపరి విచారణ చేపడతారు. ఈ కేసులో ఇప్పటికే 2 లక్షల యూఎస్ డాలర్ల మేరకు పూచీకత్తు బాండ్ చెల్లించడానికి అంగీకరించారు. అలాగే కోర్టు విధించిన షరతు మేరకు ఎలాంటి సోషల్ మీడియా మెసేజ్ లు పంపలేదు. దీంతో ట్రంప్ కు బెయిల్ లభించే అవకాశముంది.

అయితే ఈ కేసులో విచారణ జ్యూరీని ఎంపిక చేసే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. అమెరికాలో న్యాయమూర్తులు జ్యూరీ తీసుకునే నిర్ణయం ఆధారంగా తమ తీర్పును ప్రకటిస్తారు. ఇప్పుడు ట్రంప్ కేసులో ఫుల్టన్ కౌంటీకి చెందిన 12 మంది వ్యక్తులతో కూడిన జ్యూరీ.. ట్రంప్ పై మోపిన కుట్ర అభియోగాలపై తమ అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. జ్యూరీ ఏకగ్రీవ తీర్పును ఇవ్వకపోతే.. న్యాయమూర్తి మిస్ ట్రయల్ ( విచారణ పూర్తి కానట్లు) ప్రకటిస్తారు.
ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలితే కోర్టు తీర్పు సాక్ష్యాధారాలకు విరుద్ధంగా ఉందని లేదా చట్టానికి విరుద్ధంగా ఉందని చెప్పడం ద్వారా మరోసారి విచారణను కోరే అవకాశం ఉంటుంది. అసలే ఇలాంటి కేసులను విత్ డ్రా చేసుకోవడానికి కోర్టులను ఉపయోగించుకోవడంలో ట్రంప్ కు ఎంతో పేరుంది. దీంతో వచ్చే ఏడాది నవంబరు 5న జరిగే అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ నామినేషన్ రేసులో ముందంజలో ఉన్న ట్రంప్ కు ఈ కేసు విచారణ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications