అద్భుతం: నేపాల్ భూకంపం, 22గం. తర్వాత క్షేమంగా 4నెలల చిన్నారి
ఖాట్మాండ్: నేపాల్లోని భక్తాపూర్ పట్టణంలో అద్భుతం జరిగింది. భూకంపం కారణంగా ఒక భవనం కూలిపోయిన సుమారు 22 గంటల తర్వాత శిథిలాల కింద నుండి నాలుగు నెలల బాబు సోనిత్ అవాల్ను సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.
తొలుత శిథిలాల్లో పరిశీలించినప్పుడు చిన్నారిని సిబ్బంది గుర్తించలేదు. ఆ తర్వాత కాసేపటికి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో శిథిలాలను జాగ్రత్తగా తొలగించిన సిబ్బంది, బాబును రక్షించారు. చిన్నారి క్షేమంగా ఉన్నాడు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.
ప్రధానిపై నేపాలీల ఆగ్రహం
భూకంపం కారణంగా రోడ్డున పడ్డ నేపాలీలు ప్రధాని సుశీల్ కోయిరాలా పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన బాధితులు తలదాచుకుంటున్న శిబిరాలను సందర్శించారు. ఆ సమయంలో ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సాయం అందడం లేదని జనం నిలదీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే తాను వచ్చానని, త్వరలోనే ప్రభుత్వ యంత్రాంగం వచ్చి తగిన సాయం అందిస్తుందన్నారు. మరోవైపు, నేపాల్లో భయంకరమైన భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. తమకు ఆహార పానీయాలు కూడా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిరాశ్రయులయి రోడ్డున పడిన వేలాదిమంది నేపాలీ ప్రజలు ఒక సందర్భంలో పోలీసులతో ఘర్షణకు దిగి వారి వద్ద ఉన్న నీళ్ల బాటిళ్లను, ఆహార పొట్లాలను, ఇతర నిత్యావసర వస్తువులను లాక్కున్నారు. ఇదిలా ఉండగా, ఖాట్మండ్ నుంచి తిరిగి వెళ్లిపోవాలనుకున్న భూకంప బాధితులు అనేక మంది బుధవారం ప్రధాన బస్స్టేషన్కు చేరుకున్నారు. హామీ ఇచ్చినట్లుగా బస్సులు రాకపోవడంతో వారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిస్థితిని అదుపులోకి తేవడానికి వచ్చిన పోలీసులతో కోపోద్రిక్తులయిన ప్రజలు తోపులాటకు దిగారు. ఇప్పటి వరకు ఆరువేలకు పైగా మృతదేహాలను భవనాల శిథిలాల నుంచి వెలికితీసినట్లు ఉప ప్రధానమంత్రి బామ్దేవ్ గౌతమ్ చెప్పారు. 11వేలకు పైగా మంది ప్రజలు గాయపడ్డారు.