జీ7 డిక్లరేషన్: మోదీతో కలిసి దేశాధినేతల ఉమ్మడి ప్రతిజ్ఞ
ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 అంతర్జాతీయ సదస్సు ప్రపంచ దేశాల మధ్య అనేక కీలక రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చలకు వేదికైంది. జీ7 సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులు దీనికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, జర్మనీ, కెనడా, యూకే, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో పాల్గొంటోన్నాయి. ఫ్రాన్స్ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది.
ఎవియాన్ లెస్ బైన్స్ దీనికి వేదిక. ఇది 52వ జీ7 శిఖరాగ్ర సదస్సు. ఈ సదస్సు ముగింపు సందర్భంగా జాయింట్ డిక్లరేషన్ జీ7 సమ్మిట్ విడుదల చేసింది. పలు కీలక అంశాలు ఇందులో పొందుపరిచారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలతో సహా ఉక్రెయిన్- రష్యా యుద్ధం గురించీ ఇందులో ప్రస్తావించారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన నూతన శాంతి ఒప్పందాన్ని జీ7 సమ్మిట్ మనస్ఫూర్తిగా స్వాగతించింది.

ప్రపంచ రక్షణ వ్యవస్థ, అంతర్జాతీయ స్థిరత్వం చుట్టూ ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి తమ తిరుగులేని మద్దతు ఉంటుందని జీ7 స్పష్టం చేసింది. తూర్పు ఐరోపా ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి దేనికైనా సిద్ధమని అగ్రదేశాలు ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేశాయి. భవిష్యత్తులో ఉక్రెయిన్ పౌరులకు రక్షణ కల్పించడంతో పాటు ఆ దేశ భద్రతా దళాలను బలోపేతం చేసేందుకు ఆర్థిక, సైనిక వ్యూహాలను నిరంతరం అమలు చేయాలని ఈ వేదిక ద్వారా నిర్ణయించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో బలపడిన తాజా అమెరికా-ఇరాన్ ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని జీ7 దేశాలు బలపరిచాయి. అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇరాన్ ను నియంత్రించడానికి, మధ్యప్రాచ్య ప్రాంతంలో తలెత్తే తీవ్ర అస్థిరతను అడ్డుకోవడానికి ఈ ఒప్పందం ఒక చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. శాంతి స్థాపన దిశగా ఈ రెండు ప్రత్యర్థి దేశాలు త్వరలోనే స్విట్జర్లాండ్ దేశంలో ఒక అధికారిక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్న విషయం తెలిసిందే.
హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు నిరంతరాయంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని జీ7 దేశాలు సూచించాయి. ఈ జలమార్గంలో భద్రతను పర్యవేక్షించేందుకు పూర్తి సహకారాన్ని అందజేస్తామని ఉమ్మడి ప్రకటనలో భరోసా ఇచ్చారు. గ్లోబల్ ఎనర్జీ సప్లై పరంగా ఎదురవుతున్న తీవ్ర ఆటంకాలను గుర్తించిన జీ7 నాయకులు, అంతర్జాతీయ సరఫరా మార్గాలను వైవిధ్యభరితం చేయాలని తీర్మానించారు.
వైమానిక దాడులను తిప్పికొట్టే అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, లాంగ్ రేంజ్ క్షిపణులు, ఇంటర్సెప్టర్లను తక్షణమే ఉక్రెయిన్ కు అందజేయాలని జీ7 తీర్మానించింది. ఉక్రెయిన్ సొంతంగా ఆయుధాల తయారీని పెంపొందించుకునేలా వివిధ రకాల లైసెన్సింగ్ ప్రక్రియలను సులభతరం చేయాలనీ నిర్ణయించింది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా మానవతా సంక్షోభ పరిస్థితులను నివారించేందుకు జీ7 కూటమి పలు సలహాలు ఇచ్చింది. ముఖ్యంగా లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడానికి తక్షణమే కఠిన కాల్పుల విరమణ అమలు కావాలని కోరింది. హెజ్బుల్లా బలగాల నిరాయుధీకరణకు లెబనాన్ నాయకత్వం చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో వినాశనకర ఘర్షణలకు స్వస్తి చెప్పి, అక్కడ తక్షణ మానవతా సాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కూడా శాంతిభద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం నడుచుకోవాలని జీ7 అగ్రదేశాలు పేర్కొన్నాయి. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలతో పాటు తైవాన్ జలసంధి పరిధిలో యథాతథ స్థితిని బలోపేతం చేయడానికి సంఘటిత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. ఉత్తర కొరియా కొనసాగిస్తున్న అక్రమ అణు, బాలిస్టిక్ క్షిపణి ప్రాజెక్టుల విస్తరణ పట్ల జీ7 నాయకత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications