గూగుల్ ఉద్యోగులపై సుందర్ పిచాయ్ సీరియస్
ప్రతి కంపెనీలోను ఉద్యోగుల పనితీరు బాగోలేకపోయినా, కంపెనీ పనితీరు మెరుగుపడకపోతున్నా బాస్ గట్టిగా తన ఉద్యోగులపై అరుస్తారు. సంస్థ బాగు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మెతగ్గా వ్యవహరిస్తే అంతిమంగా కంపెనీ నష్టపోవాల్సి వస్తుందని.. ఆ పరిణామం ఉద్యోగులపై కూడా పడుతుందనే ఉద్దేశంతో కఠినంగా వ్యవహరిస్తారు. తాజాగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ కూడా వీరి బాటే పట్టారు.
గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తమ సంస్థలోని కొందరు ఉద్యోగులపై సీరియస్ అయ్యారు. సరిగా పనిచేయకపోవడమే దీనికి కారణం. వారంతా కష్టపడి పనిచేయడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసి సంస్థ ప్రొడక్టవిటీ పెంచడంలేదని మండిపడ్డారు. పనితీరు మార్చుకోకపోతే భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడం కంపెనీకి కష్టసాధ్యమవుతుందని హెచ్చరించారు. అందరూ కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. సంస్థలో ఉన్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే ఆ స్థాయిలో ప్రొడక్టవిటీ లేదని, లక్ష్యాన్ని గురితప్పకుండా చేధించేలా పనితీరు ఉండాలని, వినియోగదారులకు ఏం కావాలో అది ఇవ్వగలిగేలా ఉంటేనే గూగుల్ పనితీరు మెరుగుపడుతుందన్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే ప్రథమం. ఇటీవలే సంస్థలో ఉద్యోగుల నియామకాన్ని కూడా తగ్గించింది.
Recommended Video
ఫేస్బుక్ సంస్థ మెటా ఉద్యోగులపై గతంలో సంస్థ చీఫ్ మార్క్ జుకర్బర్గ్ కూడా ఇలాగే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సుందర్ పిచాయ్ కాస్తంత సున్నితంగా తన ఉద్యోగులను మందలించారు. జుకర్బర్గ్ మాత్రం గట్టిగానే మందలించారు. సంస్థలోని సీనియర్ స్థానాల్లో ఉన్న ఉద్యోగులు వారి వారి స్థానాల్లో ఉండాల్సినవారు కాదని, వారు మెటాలో ఉండకుండా ఉంటే బాగుంటుందంటూ జుకర్బర్గ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.