కరోనా విరుగుడు ఫార్ములానూ వదలట్లేదుగా: సైబర్ నేరగాళ్ల కన్ను: డేటా హ్యాక్ కోసం
వాషింగ్టన్: సైబర్ నేరగాళ్ల కన్ను ప్రాణాంతక కరోనా వ్యాక్సిన్ మహమ్మారిపైనా పడింది. ఈ వ్యాక్సిన్ను రూపొందించడానికి అహోరాత్రులు శాస్త్రవేత్తలు శ్రమించగా.. దాన్ని రాత్రికి రాత్రి కొట్టేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్కు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆ ఫార్ములాను తస్కరించడానికి అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. డేటాను హ్యాక్ చేయడానికి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు.
హ్యాకింగ్కు ప్రయత్నం..
అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫార్ములా కోసం సైబర్ నేరగాళ్లు ప్రయత్నించినట్లు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ నిర్ధారించింది. ఈ విషయాన్ని ఫైజర్-బయో ఎన్టెక్ సంస్థలు కూడా ధృవీకరించాయి. తమ డేటా, ఫార్ములా డాక్యుమెంట్లను తస్కరించడానికి హ్యాకర్లు ప్రయత్నించినట్లు వెల్లడించాయి. దీనిపై విచారణకు ఆదేశించాయి. ఫైజర్-బయోఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ బ్రిటన్లో సాధారణ ప్రజల వినియోగానికి అందుబాటులోకి వచ్చిన రెండోరోజే.. ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఫైజర్ వ్యాక్సిన్ ఫార్ములా కోసం..
కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన వివరాలు, ఫార్మలా, కంప్లీట్ డేటాకు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు ప్రస్తుతం యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ వద్ద ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లను తస్కరించడానికి తమ నెట్వర్క్, సర్వర్ల వ్యవస్థపై సైబర్ దాడులు చేసినట్లు ఈ ఏజెన్సీ వెల్లడించింది. ఎలాంటి అనుమతి లేకుండా, చట్టవ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు తమ సర్వర్ల వ్యవస్థలో చొరబడటానికి ప్రయత్నించారనే విషయాన్ని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పష్టం చేసింది.
సర్వర్లపై సైబర్ దాడులు..
బీఎన్టీ126బీ2 అనే సర్వర్లో వ్యాక్సిన్ డేటాను భద్రపరిచామని, ఇందులో చొరబడటానికి హ్యాకర్లు విశ్వ ప్రయత్నాలు చేశారనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించింది. తమ సైబర్ సెక్యూరిటీ అత్యంత పకడ్బందీగా ఉండటం వల్ల, చోరీ సాధ్యపడలేదని పేర్కొంది. ఎక్కడి నుంచి ఈ సైబర్ దాడి చోటు చేసుకుందనే విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇది తెలుసుకోవడానికి తాము సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది.
విచారణకు ఆదేశం..
సైబర్ దాడిని తాము ఏ మాత్రం ఊహించలేకపోతున్నామని ఫైజర్-బయో ఎన్టెక్ సంస్థలు పేర్కొన్నాయి. తమ డేటా భద్రంగా ఉన్నట్లు యూరోపియన్ ఏజెన్సీ సమాచారం ఇచ్చిందని తెలిపాయి. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 95 శాతం ప్రభావం చూపుతోందని, అందుకే ఆ ఫార్ములాను తస్కరించడానికి ప్రయత్నించారని వ్యాఖ్యానించాయి. కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను చోరీ చేయడానికి హ్యాకర్లు ప్రయత్నించడం కొత్తేమీ కాదు. వ్యాక్సిన్ అభివృద్ధి దశలో ఉన్నప్పుడు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నప్పుడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
Recommended Video
ఇదివరకు రష్యాపైనా..
రష్యా.. ఈ సైబర్ దాడులకు పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. తాము అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ ఫార్ములాను తస్కరించడానికి రష్యా ప్రయత్నిస్తోందంటూ అమెరికా, బ్రిటన్, కెనడా సంచలన ఆరోపణలు చేశాయి. ఫార్ములాను చోరీ చేయడానికి రష్యా ప్రయత్నిస్తోందని మండిపడ్డాయి. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్లో భాగమైన ఏపీటీ 29 లేదా కోజీ బేర్ అనే హ్యాకింగ్ గ్రూపు ఫార్మాసుటికల్ రీసెర్చ్ సంస్థల సమాచారాన్ని హ్యాక్ చేశాయనే ఆరోపణలు వినిపించాయి. దీన్ని రష్యా తోసిపుచ్చింది.