US Visa: హార్వర్డ్ అర్జెంట్ అలర్ట్: సెప్టెంబర్ 15 లోపు అమెరికా రావాల్సిందే!
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులతో పాటు ఇతర దేశాల విదేశీ విద్యార్థులకు ప్రపంచ ప్రసిద్ధ 'హార్వర్డ్ విశ్వవిద్యాలయం' ఒక అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) విద్యార్థుల వీసా నిబంధనలలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారు సెప్టెంబర్ 15 నాటికల్లా తిరిగి అమెరికా చేరుకోవాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల వల్ల ఎఫ్-1 (F-1), జే-1 (J-1) వీసాదారుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏంటి ఆ సెప్టెంబర్ 15 గడువు? ఎందుకీ కంగారు?
ఇప్పటివరకు అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' అనే వెసులుబాటు ఉండేది. అంటే కోర్సు ఎంతకాలం సాగితే అంతకాలం నిర్దిష్ట గడువు తేదీల ప్రమేయం లేకుండా అమెరికాలో ఉండేందుకు అనుమతి లభించేది. కానీ, జూలై 17, 2026న ప్రచురించిన కొత్త నిబంధనల ప్రకారం.. ఈ పాత విధానానికి ముగింపు పలికి, 'అడ్మిట్ అంటిల్ డేట్' పేరుతో ఒక ఫిక్స్డ్ గడువును ఖరారు చేయనున్నారు. విద్యార్థి కోర్సు సమయం ఎంతున్నప్పటికీ.. గరిష్టంగా నాలుగేళ్ల పరిమితి మాత్రమే విధిస్తారు. ఈ అమల్లోకి వచ్చే తేదే సెప్టెంబర్ 15 కావడంతో, అంతకంటే ముందే యూఎస్ చేరుకోవాలని హార్వర్డ్ సూచిస్తోంది.

దేశం విడిచి వెళ్తే కొత్త చిక్కులు!
ప్రస్తుతం అమెరికాలోనే ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు ఈ కొత్త నిబంధనల నుంచి తాత్కాలిక మినహాయింపు లభిస్తుంది. వారు పాత పద్ధతిలోనే కోర్సు పూర్తయ్యే వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఒకవేళ విద్యార్థులు ఇప్పుడు అమెరికా నుంచి తమ స్వదేశాలకు వెళ్లి, సెప్టెంబర్ 15 తర్వాత మళ్లీ యూఎస్ లో అడుగుపెడితే మాత్రం.. వారి పాత మినహాయింపులు రద్దయిపోయి, కొత్తగా విధించే కఠినమైన గడువు నిబంధనల పరిధిలోకి వెళ్లిపోతారు. అందుకే, పర్యటనలు వాయిదా వేసుకుని, ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని, వీసా పత్రాలు (I-20, DS-2019, I-94) సరిచూసుకోవాలని హార్వర్డ్ ఇంటర్నేషనల్ ఆఫీస్ హెచ్చరించింది.
కొత్త నిబంధనలతో మారనున్న లెక్కలు ఇవే!
ఈ కొత్త వీసా రూల్స్తో విదేశీ విద్యార్థులకు పలు ఆంక్షలు ఎదురుకానున్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత దేశంలో ఉండేందుకు ఇచ్చే సమయాన్ని (గ్రేస్ పీరియడ్) 60 రోజుల నుంచి ఏకంగా 30 రోజులకు కుదించారు. దీనికి తోడు కోర్సులు, డిగ్రీ స్థాయిలను మార్చుకోవడం లేదా వేరే విశ్వవిద్యాలయాలకు బదిలీ (ట్రాన్స్ఫర్) అవ్వడంపై తీవ్ర పరిమితులు విధించారు. పిహెచ్డీ వంటి నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టే సుదీర్ఘ కోర్సుల్లో ఉన్న విద్యార్థులు ఇకపై గడువు పొడిగింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో అదనపు రుసుములు, బయోమెట్రిక్స్, నేపథ్య తనిఖీలు తప్పనిసరి చేశారు.
భారతీయ విద్యార్థులపైనే ఎక్కువ ప్రభావం!
సెప్టెంబర్ 2026 నాటికి యుఎస్ వీసా విధానాల్లో వస్తున్న ఈ మార్పులు, పెండింగ్లో ఉన్న గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్లు.. విదేశీ విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో చదువు పూర్తి చేసి, అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడాలని భావించే భారత్, చైనా దేశాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులపై ఈ కొత్త నిబంధనలు నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణాల విషయంలో తొందరపడకుండా, విశ్వవిద్యాలయ నిపుణుల సలహాలు తీసుకున్నాకే అడుగులు వేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.














Click it and Unblock the Notifications
