అమెరికాలో మళ్లీ కరోనా టెర్రర్.. 24 గంటల్లో లక్షన్నర కొత్త కేసులు
అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. గతేడాది కూడా అమెరికాను చిగురుటాకులా కరోనా మహమ్మరి వణికించింది. ఇప్పుడు అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం కలవరపెడుతోంది. గత 24 గంటల వ్యవధిలో అమెరికాలో లక్షన్నర కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఇంత భారీగా కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది.
గత వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో అత్యధిక భాగం అమెరికా నుంచే ఉన్నట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో మూడో వంతు ఈ రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో 1,49,788 ఇన్ఫెక్షన్లు బయటపడగా.. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3.53 కోట్లకు చేరింది.

మరో 668 మంది మృతి చెందగా ఇప్పటివరకు కొవిడ్ కాటుకు బలైపోయినవారి సంఖ్య 6.14 లక్షలకు చేరింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియెంట్ వ్యాప్తి చెందడమే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఈ కేసుల పెరుగుదలతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత జోరందుకుంది. గత 10 రోజుల వ్యవధిలోనే 30 లక్షల మందికి టీకా ఇచ్చినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది.












Click it and Unblock the Notifications