భూగర్బంలో ఐఎస్ఐఎస్ బంకర్లు, సొరంగాలు
ఇరాక్: ఇరాక్ లోని ప్రసిద్ధి చెందిన రామాది నగరంలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు భూగర్బం చీల్చుకుంటూ వెళుతున్నారని వెలుగు చూసింది. పెద్ద పెద్ద సొరంగాలు, బొరియలు, గుహలు, బంకర్లు నిర్మించిన విషయం బయటపడింది.
ఇరాక్ లో రామాది నగరం ప్రసిద్ధి చెందినది. ఈ నగరంపై పట్టు సాధించాలని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తున్నారు. అయితే రామాది నగరాన్ని వదులుకోవడానికి ఇరాక్ సేనలు సిద్దంగా లేవు.
ఎప్పటికప్పుడు వైమానిక దాడులు చేస్తూ ఉగ్రవాదులను రామాది నగరం నుంచి తరిమివేస్తున్నారు. అయితే రామాది నగరంలో 25 శాతం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉంది. వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఒక ఇంటి నుంచి మరో ఇంటిలోకి వెళ్లడానికి భూగర్బంలో సొరంగ మార్గాలు ఏర్పాటు చేశారు.

వైమానిక దాడులు జరిగే సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఉగ్రవాదులు భూమికి 10 మీటర్ల దిగువన బంకర్లు నిర్మించారని తాజాగా వెలుగు చూసింది. ఒకటి నుంచి రెండు మీటర్ల సొరంగ మార్గాలు ఏర్పాటు చేసి అక్కడే నక్కి ఉంటారని తెలిసింది.
కొన్ని ప్రాంతాల్లో 700 నుంచి 800 మీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గాలు ఉన్నాయని ఇరాక్ అధికారులు అంటున్నారు. వైమానిక సేనలు ఈ బంకర్లు, సొరంగ మార్గాలను ధ్వంసం చేస్తేనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు అడ్డుకట్టవేసినట్లు అవుతుందని ఇరాక్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications