2024లో మళ్లీ కలుద్దాం- వైట్హౌస్ సన్నిహితులతో ట్రంప్- మరోసారి పోటీ సంకేతాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరాడినా ఫలితం దక్కకపోవడంతో నిరాశకు లోనైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. క్రిస్మస్ పార్టీ సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన అతిధులతో ట్రంప్ మాట్లాడుతూ నాలుగేళ్లు అద్బుతంగా గడిచాయని చెప్పుకొచ్చారు.
నాలుగేళ్ల పాటు వైట్హౌస్లో అప్రతిహత పాలన సాగించిన డొనాల్డ్ ట్రంప్ వేటినీ లెక్కచేయలేదు. అమెరికా ఫస్ట్ నినాదంతో ఇతర దేశాలకు కంట్లో నలుసుగా మారారు. చివరికి అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరతానన్న అతి విశ్వాసంతో ఉన్నారు. కానీ చివరి నిమిషంలో బైడెన్ హవాతో ట్రంప్ అనూహ్యంగా వెనుకబడిపోయారు. దీంతో ఆయన ఎన్నికల అక్రమాలపై పోరాటం చేస్తున్నారు. అయితే అక్రమాలకు తగిన ఆధారాలు చూపడంలో మాత్రం ట్రంప్ విఫలమయ్యారు. దీంతో బైడెన్ గెలుపు ఖాయంగా మారింది.
బైడెన్ గెలుపు తప్పదని తేలిపోవడంతో ఎన్నికల అక్రమాలపై పోరాటం చేస్తూనే అధికార మార్పిడికి సహకరిస్తానని ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఇప్పుడు తనను కలిసిన సన్నిహితులతో మాట్లాడుతూ నాలుగేళ్లు అద్భుతంగా గడిచాయి. మరో నాలుగేళ్లు అధికారం ఉంటుందని భావిస్తున్నా, అందుకోసం న్యాయపోరాటం చేస్తున్నా, కుదరకపోతే నాలుగేళ్ల తర్వాత మరోసారి పోటీ చేస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేతలు, పవర్ బోకర్లుగా భావించే వారు పాల్గొన్న ఈ పార్టీలో ట్రంప్ వ్యాఖ్యలు క్షణాల్లోనే అమెరికాలో వైరల్ అయ్యాయి.