ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడు కాక తప్పదా: చివరి బంతి వరకు మ్యాచ్ ఆడతానంటోన్న మాజీ బౌలర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ పరిణామాలు మరింత సంక్షోభంలోకి కూరుకుపోయాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. తన పదవికి ఆయన రాజీనామా చేయడం తప్పకపోవచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కోల్పోయింది. ఇప్పటికే 30 మంది ఎంపీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు.

క్యాంప్ రాజకీయాలు..
ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటోన్నారు. ఎల్లుండి తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చిందాయనకు. దీనితో అక్కడ క్యాంప్ రాజకీయాలు జోరుగా కొనసాగుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎంపీలపై నిఘా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వారంతా సిింధ్ ప్రావిన్స్లో ఉంటోన్నారు. తాను రాజీనామా చేయబోనని, ప్రభుత్వాన్ని కాపాడుకుంటానని ఇమ్రాన్ ఖాన్ ధీమా వ్యక్తం చేస్తోన్నారు.

మైనారిటీలో ప్రభుత్వం..
మిత్ర పక్షాలకు చెందిన సభ్యుల రాజీనామాతో పాకిస్తాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి లేదు. ముందు నుంచీ మిత్రపక్షాల మద్దతుతోనే ఆయన నెట్టుకొస్తోన్నారు. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో మిత్రపక్షాలు సంకీర్ణ కూటమి నుంచి తప్పుకోవడం వల్ల మైనారిటీలో పడినట్టే కనిపిస్తోంది.

సంకీర్ణ ప్రభుత్వం
342 మంది సభ్యుల బలం ఉన్న పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 172. 2018 నాటి ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి దక్కినవి 155 స్థానాలే. దీనితో ఆయన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇతర పక్షాలతో మద్దతును తీసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహా ఇతర మిత్ర పక్షాల సభ్యులు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. రాజీనామాల బాట పట్టాయి.

సొంత పార్టీ సభ్యులు సైతం..
ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా మంత్రులు సైతం రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. ఇందులో సొంత పార్టీకి చెందిన ఎంపీలు సైతం ఉన్నారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటూ అంచనాలు వెలువడుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం నడపించడానికి అవసరమైన లౌక్యం ఆయనలో కొరవడిందని, అందుకే ఈ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అవినీతిని అడ్డుకునే ప్రయత్నం..
పాకిస్తాన్ చరిత్రలోనే మొదటిసారిగా ఇద్దరు హిందువులను పాకిస్తాన్ మిలటరీలో లెప్టినెంట్ కల్నల్గా ప్రమోట్ చేయడం చాలామందికి నచ్చట్లేదని చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయించడం, వారిని జైలుపాలు చేయడం కూడా రాజకీయంగా వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైందని, ఫలితంగా ప్రధాన ప్రతిపక్షాలు ఏకం అయ్యాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

చిట్టచివరి బంతి వరకూ
మ్యాచ్ ఇంకా మిగిలే ఉందని, చిట్టచివరి బంతి వరకు ఆడతాననీ ఇమ్రాన్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారికి షాక్ తప్పదని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి తన వ్యూహాలు తనకు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టికల్ 63-ఏ ప్రకారం.. తమ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న వారిని అనర్హులుగా ప్రకటించామని, రాజీనామా చేసిన సొంత పార్టీ ఎంపీలు పునరాలోచనలో పడ్డారని అన్నారు.

పూర్తి కాలం పదవిలేని ప్రధాని..
ప్రజా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరు కూడా ప్రధానమంత్రిగా పూర్తికాలం పాటు పని చేయలేదు. యూసుఫ్ రజా గిలానీ, నవాజ్ షరీఫ్- విచక్షణాధికారాల కారణంగా తమ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ గనక రాజీనామా చేయాల్సిన పరిస్థితే ఏర్పడితే- అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయనే అవుతారు. ఇదివరకు గిలానీ గానీ, నవాజ్ షరీఫ్ గానీ విచక్షణాధికారాలకు బలి అయ్యారు.












Click it and Unblock the Notifications