ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టం, టిక్కా కూడా: కమలా హారీస్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారీస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారతీయ ఓటర్లను ఆకర్షించేలా తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి కూడా వెల్లడించారు. తనకు మంచి సాంబార్తో ఇడ్లీ, టిక్కా అంటే తనకు చాలా ఇష్టామని కమలా హారీస్ తెలిపారు.
ఇడ్లీ సాంబార్.. ఎలాంటి టిక్కా అయినా ఇష్టమే..
కమలా హారీస్ తండ్రి జమైకన్ కాగా, తల్లి భారతీయురాలు. కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న తొలి భారత సంతతి వ్యక్తి, నల్లజాతి మహిళ కమలా హారీసే కావడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమలా హారీస్ను మీకు ఇష్టమైన భారతీయ వంటకాలు ఏంటని ప్రశ్నించగా.. ఆమె బదులిచ్చారు. తనకు ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టమని, ఇక నార్త్ ఇండియన్ వంటకం టిక్కా అంటే కూడా తనకు ఇష్టమని తెలిపారు.
మానసిక ఆరోగ్యం కోసం కమలా హారీస్ ఇలా చేస్తారు..
ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ వీడియోలో కాలిఫోర్నియా సెనెటర్ అయిన కమలా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తన మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా ఆమె వెల్లడించారు. తాను తెల్లవారుజామున వ్యాయామం చేస్తానని చెప్పారు. అంతేగాక, తన పిల్లలతో సరదాగా మాట్లాడటం, వారితో గడపడం, వంట చేయడం ద్వారా తాను ఒత్తిడి నుంచి రిలీఫ్ అవుతానని కమలా హారీస్ తెలిపారు. తన భర్త డగ్కు వంట ఎలా చేయడమో కూడా నేర్పిస్తానని చెప్పుకొచ్చారు.
జీవితంలో ముందుకెళ్లాలంటే.. ‘నో'కు ‘నో' చెప్పండి: కమలా హారీస్
జీవితంలో ముందుకెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకోకూడదు. ఇది నీ సమయం కాదు.. ఇప్పుడు నువ్వు కాదు లాంటి తిరస్కారపు మాటలు నా కెరీర్లో ఎన్నోసార్లు విన్నాను. నేను చెప్పేది ఒకటే.. ఈ కాదు అనే పదాన్ని బ్రేక్ఫాస్ట్ లోనే తినేస్తా. మీకు కూడా అదే సిఫార్సు చేస్తా. ఎందుకంటే అదే మంచి బ్రేక్ఫాస్ట్. తిరస్కారపు మాటలను పక్కనే ముందుకు సాగితేనే విజయం సాధిస్తామని హారీస్ వ్యాఖ్యానించారు. యువత, మహిళలకు కమలా హారీస్ ఇచ్చే సలహా ఏమిటని అడగ్గా.. ఆమె ఈమేరకు స్పందించారు.
ఓటర్ల నిర్ణయం మనస్ఫూర్తిగా ఉండాలి..
ఒకటి రెండు ఓట్లు మొత్తం ఎన్నికల ఫలితాలనే మార్చేసిన ఘటనలున్నాయని, ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయం మనస్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ఓటర్లు తీసుకునే నిర్ణయం వారి జీవితంపై ప్రభావం చూపిస్తుందని కమలా హారీస్ వివరించారు. ఒక్క ఓటు ఫలితాలను మార్చగలదా? అనే ప్రశ్నకు కమల ఈ విధంగా స్పందించారు.
భవిష్యత్ తరాల కోసం ప్రణాళికలు సిద్ధం..
రాబోయే తరాలకు స్థిరమైన, పర్యావరణమైన భవిష్యత్తును ఎలా అందిస్తారని ప్రశ్నించగా.. దీని కోసం డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, తాను చాలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కమలా హారీస్ తెలిపారు. అనేక రంగాల్లో ఉద్యోగాలు సృష్టించడంతోపాటు 2050 నాటికి జీరో ఉద్గారాలను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కాగా, నవంబర్ 3 న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పదవిలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (74), ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను.. జో బిడెన్, హారిస్ సవాలు చేస్తున్నారు.