నరేంద్రమోడీతో ఫోన్ లో సంభాషించనున్న ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం క్రమంగా కరిగిపోతోంది. కొన్ని గంటల కిందటి వరకూ సరిహద్దుల్లో అలముకున్న యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయి. రెండు దేశాల మధ్య పుల్వామా దాడికి ముందునాటి పరిస్థితులు క్రమంగా ఏర్పడుతున్నాయి.
తమ చేతిలో బందీగా చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను సురక్షితంగా స్వదేశానికి అప్పగిస్తామంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ వెల్లడించిన కొన్ని గంటల్లో.. ఇదే విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రకటించారు. అభినందన్ ను శుక్రవారం స్వదేశానికి అప్పగిస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.
అంతేకాకుండా- తాను స్వయంగా భారత ప్రధానమంత్రితో ఫోన్ ద్వారా సంభాషిస్తానని అన్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పూరక వాతావరణాన్ని నివారించడానికి తానే మొదటగా చొరవ తీసుకుంటానని ఇమ్రాన్ అన్నారు. గురువారం రాత్రి లేదా, శుక్రవారం ఉదయం ఆయన నరేంద్రమోడీకి ఫోన్ చేయవచ్చని తెలుస్తోంది.
జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ లను తరిమికొట్టే సందర్భంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్ 21 పై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరపడం ప్రారంభించడంతో ఆత్మరక్షణ కోసం అభినందన్.. ప్యారాషూట్ సహాయంతో కిందికి దూకారు. పాకిస్తాన్ భూభాగంపై దిగారు. ఆయనను యుద్ధ ఖైదీగా బంధించారు పాకిస్తాన్ సైనికులు.
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. జెనీవా ఒప్పందం ప్రకారం.. అభినందన్ ను వెంటనే సురక్షితంగా స్వదేశానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ పై ఒత్తిళ్లు పెరిగాయి. దీనికి తలొగ్గింది పాకిస్తాన్. అభినందన్ ను స్వదేశానికి అప్పగిస్తామని ఖురేషీ వెల్లడించారు. ఆ వెంటనే.. ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. శుక్రవారం అభినందన్ పాకిస్తాన్ నుంచి భారత్ కు రానున్నారు.
పుల్వామాలో ఉగ్రదాడి చేసిన జైషె మహమ్మద్ శిక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం మంగళవారం తెల్లవారు జామున నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ భూభాగంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. అక్కడి బాలాకోట్ పట్టణ శివార్లలో జైషె మహమ్మద్ కు చెందిన అతి పెద్ద ఉగ్రవాద శిక్షణా శిబిరంపై మనదేశ వైమానిక దళం నిప్పులు కురిపించింది. ఆ శిబిరాన్ని భస్మీపటలం చేసింది. దీనితో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న పాకిస్తాన్.. బుధవారం భారత్ పై దండెత్తింది. నియంత్రణ రేఖ దాటి ముందుకొచ్చింది. భారత సైనిక శిబిరాలు, ఆయుధ కర్మాగారాలను టార్గెట్ గా చేసుకుని, బాంబులు కురిపించింది. వాటిని అభినందన్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. పాక్ ఎయిర్ క్రాఫ్ట్ లను తరమికొట్టారు.