ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ కు 70 MM సినిమా చూపిన భారత్..!!
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని మండిపడింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. గత ఏడాది పహల్గామ్ దాడి అనంరం తాము చేపట్టిన చర్యలను వక్రీకరించి చూపుతోందని నిప్పులు చెరిగింది. అంతర్జాతీయ నిబద్ధతలను పదే పదే ఉల్లంఘిస్తోందని కూడా స్పష్టం చేసింది.
భద్రతమండలి సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. పాకిస్థాన్ తప్పుడు ప్రచారాలను, ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నాలను స్పష్టంగా ఖండించారు. భారత్, భారత పౌరులకు హాని కలిగించడమే ఏకైక అజెండాగా పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు తాను ఇచ్చే సమాధానం ఇదేనంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టిన హరీష్.. ఆ దేశ వైఖరిని తప్పుపట్టారు. ఉగ్రవాద ప్రోత్సాహిత విధానాలపై ఉతికి ఆరేశారు.

గత సంవత్సరం భారత్ చేపట్టిన సైనిక చర్యలకు సంబంధించి పాకిస్తాన్ భద్రతమండలికి సమర్పించిన నివేదికను హరీష్ పూర్తిగా తిరస్కరించారు. అది- అసత్య, స్వార్థపూరిత కథనమని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 2025 ఏప్రిల్లో జరిగిన దాడిని ప్రస్తావిస్తూ పాకిస్తాన్ ప్రోత్సహిత ఉగ్రవాదులు జరిపిన హేయమైన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలను కోల్పోయారని భద్రతమండలికి గుర్తు చేశారు.
ఈ దారుణమైన ఉగ్రవాద చర్యకు పాల్పడిన సూత్రధారులు, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చిన వారిని అంతర్జాతీయ స్థాయిలో నిలదీయాలంటూ భద్రత మండలి సైతం సూచించిందని, తాము సరిగ్గా అదే చేశామని హరీష్ వివరించారు. భారత్ స్పందన పరిమితమైనదని, నిర్దిష్ట లక్ష్యంతో కూడుకున్నదని ఉద్ఘాటించారు. తాము తీసుకున్న చర్యలు ఉద్రిక్తతను పెంచనివని అభివర్ణించారు. బాధ్యతాయుతమైనవని పేర్కొన్నారు.
ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడంపై దృష్టి సారించిన చర్యలేనని ఆయన వివరించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కూడా మే తొలి వారం వరకూ పాకిస్తాన్ తమను బెదిరిస్తూ వచ్చిందని, ఆ తర్వాతే ఆ దేశం శాంతిని కోరిందని గుర్తు చేశారు. మే 10న పాకిస్థాన్ సైన్యం నేరుగా తమకు ఫోన్ కాల్ చేసి పోరాటాన్ని ఆపాలని వేడుకుందని, ఈ ఆపరేషన్ల వల్ల పాకిస్తాన్ కు స్పష్టమైన నష్టం వాటిల్లిందని చెప్పారు.












Click it and Unblock the Notifications