బోర్డర్ భగ్గుమంటోన్న వేళ: భారత్-చైనా మధ్య చారిత్రాత్మక ఘట్టం: అయిదు సూత్రాల ఏకాభిప్రాయం
మాస్కో: సరిహద్దు వివాదాలను శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా భారత్-చైనా చారిత్రాత్మక అడుగులు వేశాయి. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలు కాస్త.. ఘర్షణలకు దారి తీయడం.. వాటి తీవ్రత మరింత పెరిగి యుద్ధ వాతావరణం నెలకొనడం వంటి పరిణామాలను నియంత్రించడానికి అయిదు సూత్రాల ఏకాభిప్రాయానికి వచ్చాయి. రెండు దేశాల మధ్య తలెత్తే భేధాభిప్రాయాలను వివాదాలుగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వని విధంగా వ్యవహరించుకోవాలని పరస్పరం నిర్ణయానికి వచ్చాయి.
Recommended Video
మాస్కో వేదికగా..
రష్యా రాజధాని మాస్కో వేదికగా కొనసాగుతోన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా భారత్-చైనా మధ్య ఈ ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సదస్సులో భారత్, చైనా విదేశాంగ మంత్రులు సుబ్రహ్మణ్యం జైశంకర్, వాంగ్ యీ ముఖాముఖి భేటీ అయ్యారు. సరిహద్దు వివాదాలపై సుదీర్ఘకాలం పాటు చర్చించారు. జైశంకర్.. సరిహద్దుల్లో ప్రత్యేకించి- తూర్పు లఢక్ సెక్టార్ పరిధిలో చైనా సైనికుల దూకుడుతనం, దుందుడుకు చర్యల గురించి ప్రస్తావించారు. వారి తీరును తప్పు పట్టారు. భారత్ తరఫున నిరసనను వ్యక్తం చేశారు.
ఉమ్మడి ప్రకటనలో కీలకాంశాలు..
ఈ భేటీ ముగిసిన అనంతరం వారిద్దరూ ఓ ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. భారత్-చైనా మధ్య భవిష్యత్తులో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ.. శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నిర్ణయించినట్లు తెలిపారు. భేదాభిప్రాయాలు, మనస్పర్థలను వివాదాలుగా రూపుదిద్దుకోనివ్వకూడదని తీర్మానించినట్లు పేర్కొన్నారు. సరిహద్దుల్లో వివాదాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని రెండు దేశాల విదేశాంగ మంత్రులు అంగీకరించారు. ఆ వివాదాల వల్ల తమలో ఏ ఒక్కరికీ మేలు కలగదని అభిప్రాయపడ్డారు.
సరిహద్దు వివాదాలపై తక్షణ నివారణ చర్యలు..
ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి తక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. సరిహద్దుల్లో చొరబాటుకు ప్రయత్నించకపోవడం, వాస్తవాధీన రేఖ వద్ద సమ దూరాన్ని పాటించడం, ఉద్రిక్తతలు చల్లారేలా తక్షణ నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నట్లు ఈ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇప్పటికే అమలులో ఉన్న ఒప్పందాలు, ఒడంబడికలు, ప్రొటోకాల్స్ను తప్పనిసరిగా అనుసరించి తీరాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఆ రెండు వ్యవస్థలూ కొనసాగింపు..
సరిహద్దుల్లో వివాదాలు తలెత్తిన ప్రతీసారీ తెరమీదికి వచ్చే స్పెషల్ రెప్రజెంటేటివ్ మెకానిజం, వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC)లను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 1993, 1996 మధ్య కుదిరిన ఒప్పందాలు తరచూ ఉల్లంఘనలకు గురవుతున్నాయని, వాటిని అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరింపజేయడం ఈ ఒప్పందాల ఉల్లంఘన కిందికి వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. రెండు దేశాల సైనికులు ఎలాంటి రెచ్చగొట్టే, కవ్వింపు చర్యలకు పాల్పడకూడదనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.