Iran Israel war: ఇరాన్-ఇజ్రాయెల్ కు భారత్ కీలక ఆఫర్..! దాడులు, ప్రతిదాడులపై ఫస్ట్ రియాక్షన్..!
చిరకాల ప్రత్యర్థులు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న పోరు(Iran Israel war)తో పశ్చిమాసియా మరోసారి నిప్పుల కుంపటిగా మారిపోయింది. తాజాగా ఇరాన్ తో అమెరికా జరిపిన అణు చర్చలు విఫలం కావడంతో మధ్యలో ఎంటరైన ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఇరాన్ లోని అణుప్లాంట్లతో పాటు సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు కురిపిస్తోంది. ఇందులో ఇరాన్ కు చెందిన పలువురు సైనికాధికారులు చనిపోయారు. దీంతో ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగింది.
ఈ నేపథ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు,ప్రతిదాడులపై మిత్రదేశం భారత్ స్పందించింది. ఇరు దేశాలకూ చిరకాల మిత్రదేశంగా ఉన్న భారత్ వెంటనే దాడులు ఆపి సంయమనం పాటించాలని ఇరుదేశాలనూ కోరింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ కీలక ప్రకటన చేసింది. ఇందులో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సాయం చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చింది. దీంతో పాటు ఇరు దేశాల ఘర్షణలపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇరాన్ లోని అణుప్లాంట్లపై ఇజ్రాయెల్ దాడులు చేసిందన్న విషయంతో పాటు ఇరు దేశాల మధ్య సాగుతున్న దాడులు, ప్రతిదాడుల్ని నిశితంగా గమనిస్తున్నట్లు విదేశాంగశాఖ తన ప్రకటనలో తెలిపింది. ఉద్రిక్తతలు పెంచే చర్యలన్నింటినీ వెంటనే నిలిపేయాలని ఇరు దేశాల్నీ కోరింది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాల్నీ వాడుకోవాలని సూచించింది. ఇరు దేశాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, కాబట్టి వారి మధ్య వివాద పరిష్కారానికి సహకరిస్తామని తెలిపింది.

అలాగే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో ఆయా దేశాల్లోని తమ ఎంబసీలు జారీ చేస్తున్న సూచనల్ని పాటించాలని భారత పౌరుల్ని విదేశాంగశాఖ కోరింది. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని, ఎప్పటికప్పుడు తాము ఇచ్చే సూచనల్ని అమలు చేయాలని వారిని కోరుతోంది. అలాగే ఇరు దేశాల్లోని భారత ఎంబసీలు సైతం ఇలాంటి సూచనల్నే జారీ చేశాయి.












Click it and Unblock the Notifications