సర్జికల్ స్ట్రయికా? బార్డర్ ఫైరింగా?: ఇండో-పాక్ మాటల యుద్ధం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రమూకల పైన ఇండియన్ ఆర్మీ సర్జికల్ దాడులు చేసిందని తెలియగానే పాకిస్థాన్ ఉలిక్కిపడింది. తమ భూభాగంలో సర్జికల్ దాడులంటే తమకే నష్టమని భావించి అది కేవలం క్రాస్ బోర్డర్ ఫైరింగ్ మాత్రమేనని, ఇందులో ఇద్దరు సైనికులు చనిపోయారని చెబుతోంది.
కానీ భారత ఆర్మీ మాత్రం తాము చేసింది కచ్చితంగా సర్జికల్ దాడులేనని చెబుతోంది. తాము ముందే అన్ని ఆధారాలు కూడా సేకరించామని స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఈ మాట అంటుందని తాము ముందే ఊహించినట్లు కూడా ఆర్మీ చెబుతోంది.
ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు గాయపడ్డారని వెల్లడించింది. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే ఫొటోలను విడుదల చేస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో పారా కమాండోలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి.
యూరి దాడికి ప్రతీకారంగానే జరిగిన ఈ దాడుల్లో ఆర్మీ పాకిస్తాన్ భూభాగంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకుపోయింది. అర్ధరాత్రి తర్వాత కమాండోలు చొచ్చుకువెళ్లి సూర్యోదయం కాకముందే మళ్లీ నియంత్రణ రేఖకు ఇవతలికి వచ్చేశారు. కాగా, యూరి దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రధాని మోడీ ముందే హెచ్చరించిన విషయం తెలిసిందే.