అరుణాచల్ ప్రదేశ్ లో పేర్ల మార్పు-చైనా నిర్ణయాన్ని తోసిపుచ్చిన భారత్-పేర్లు మారిస్తే చాలా ?
భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని స్ధలాల పేర్లను మార్చాలని చైనా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని పేర్లను మార్చడం ద్వారా వాటిని తమవిగా చెప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు భారత్ ఆదిలోనే చెక్ పెట్టింది.
అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాల పేర్లను మార్చినా ఆ రాష్ట్రం మాత్రం భారతదేశంలోనే అంతర్భాగంగా ఉంటుందని, ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుందనే వాస్తవాన్ని మార్చదని భారత్ పునరుద్ఘాటించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందని, అరుణాచల్లోని స్థలాలకు కనిపెట్టిన పేర్లను మార్చడం వల్ల ఈ వాస్తవం మారబోదన్నారు. అరుణాచల్లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా తన సొంత భాషలో మార్చినట్లు వస్తున్న వార్తలపై ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని పేర్లను చైనా మార్చినట్లు తమ దృష్టికి వచ్చిందని అరిందర్ బాగ్చీ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని స్థలాల పేర్లను మార్చడానికి చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదని, 2017 ఏప్రిల్లోనూ అటువంటి పేర్లను కేటాయించాలని కోరిందని బాగ్చి వెల్లడించారు. చైనా ప్రభుత్వం బుధవారం తన మ్యాప్లో అరుణాచల్లోని 15 ప్రదేశాల పేర్లను మార్చింది. చైనా అరుణాచల్ను 'సౌత్ టిబెట్' అని పిలుస్తోంది. అలాగే ఈ 90,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రదేశం తమదిగా చెప్పుకుంటోంది.
చైనీస్ మ్యాప్లలో ఉపయోగించేందుకు అరుణాచల్లోని 15 ప్రదేశాలకు 'ప్రామాణిక' పేర్లను కలిగి ఉన్నామని చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వారు జాంగ్నాన్లోని ప్రదేశాలకు చైనీస్ అక్షరాలు, టిబెటన్, రోమన్ వర్ణమాల పేర్లను ప్రకటించారు, అరుణాచల్ ప్రదేశ్కు చైనీస్ పేరు పెట్టడాన్ని అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో ప్రచురించింది.
చైనా అత్యున్నత శాసన మండలి అయిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ అక్టోబర్ 23న ఆమోదించిన కొత్త సరిహద్దు చట్టాన్ని అమలు చేయడానికి కేవలం రెండు రోజుల ముందు స్థలాల పేరు మార్చారు. "దేశం యొక్క భూ సరిహద్దు ప్రాంతాల రక్షణ, దోపిడీ"ని పేర్కొంటూ కొత్త చట్టం ఆమోదించారు. జనవరి 1 నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని కమిటీ పేర్కొంది. కొత్త చట్టం భారత్తో సరిహద్దు కోసం ప్రత్యేకంగా రూపొందించలేదని చైనా ప్రభుత్వం చెబుతోంది. చైనా తన 22,457 కిలోమీటర్ల భూ సరిహద్దును భారత్తో సహా 14 దేశాలతో పంచుకుంటుందని వెల్లడించింది.