తాలిబన్లపై భారత్ ప్లాన్ ఇదే ? ఆప్ఘన్ చుట్టూ వలయం-రష్యా సాయంతో ఉక్కిరిబిక్కిరి చేసేలా..
ఆప్ఘనిస్తాన్ లో మారుతున్న పరిస్ధితులు భారత్ సహా ఆప్ఘన్ చుట్టు పక్కల ఉన్న జేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, అల్ ఖైదా సాయంతో తాలిబన్లు పన్నుతున్న వ్యూహాలు భారత్ కు రేపు ఇబ్బందికరంగా మారబోతున్నాయి. అందుకే వాటిని కౌంటర్ చేసేందుకు భారత్ కూడా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో రష్యా సాయం తీసుుకునేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో తాలిబన్లకు, పరోక్షంగా పాకిస్తాన్ కు అడ్డుకట్ట వేసేందుకు రూట్ క్లియర్ అవుతోంది. త్వరలో ఈ ఆపరేషన్ ప్రారంభం కాబోతోంది.
ఆప్ఘన్ లో తాలిబన్ల రాజ్యం
ఆప్ఘనిస్తాన్ లో త్వరలో తాలిబన్ల రాజ్యం ఏర్పాటు కాబోతోంది. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్లపై అల్ ఖైదాతో పాటు పలు ఇస్లామిక్ గ్రూపులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ఆప్ఘనిస్తాన్ తో ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఇస్లామిక్ రాజ్యాల భూభాగాలను తిరిగి తమ స్వాధీనం లోకి తెచ్చుకునేందుకు తాలిబన్లు కృషి చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో ఓవైపు ఆప్ఘనిస్తాన్ లో షరియా చట్టాల పాలనను అమల్లోకి తెస్తూనే మరోవైపు తాలిబన్లు విదేశాల్లోని ఇస్లామిక్ భూభాగాలుగా చెప్పుకుంటున్న వాటిపై దృష్టిసారిస్తున్నారు. దీంతో ఇప్పుడు వాటి విషయంలో తాలిబన్లు ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇందులో భారత్ లోని కశ్మీర్ తో పాటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్, ఇంకొన్ని భూభాగాలు ఉన్నాయి.
కశ్మీర్ వ్యూహాలపై భారత్ ఆందోళన
ఆప్ఘనిస్తాన్ ను పాశ్చాత్య దేశాల చెర నుంచి విడిపించిన తరహాలోనే భారత్ లోని కశ్మీర్ ను కూడా విముక్తం చేయాలని అల్ ఖైదా తాజాగా తాలిబన్లకు పిలుపునిచ్చింది. తాలిబన్లకు ఎప్పుడూ అండగా నిలిచే అల్ ఖైదా నేతలు చేసిన ఈ ప్రకటనతో తాలిబన్ల తదుపరి వ్యూహం కశ్మీర్ లోనే ఉండబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదంత సులుపు కాదని వారితో పాటు మిగతా దేశాలకీ తెలుసు. అయినా కశ్మీర్ వంటి చోట్ల ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ సాయంతో తాలిబన్లు చొరబాట్లు లేదా దాడులకు దిగవచ్చనే సమాచారంతో భారత్ అప్రమత్తమవుతోంది. ఇందుకోసం ముందుగానే కౌంటర్ వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా తాలిబన్ల కట్టడికి భారత్ వేస్తున్న ప్రణాళికలు దీర్ఘకాలికంగానే ఉండబోతున్నాయి.
రష్యా సాయం కోరిన భారత్
కశ్మీర్ పై తాలిబన్ల కన్ను ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ లో గెలుపు తర్వాత కశ్మీర్ పై దృష్టిసారించేందుకు తాలిబన్లతో పాటు పాకిస్తాన్ కూడా ఎదురుచూస్తుున్నాయి. పాకిస్తాన్, తాలిబన్లు ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఏదైనా దుశ్చర్యలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందని భారత్ అంచనా వేస్తోంది. అందుకే ఇప్పుడు తాలిబన్ల ఇస్లామీకరణ ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు భారత్ రష్యా సాయం కోరుతోంది. అందుకు తాలిబన్లకు మరో మిత్రదేశం అయిన రష్యా కూడా సిద్ధంగానే ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఆప్ఘన్ వరకూ తాలిబన్లకు సాయం చేసినా బయట మాత్రం వారిని కట్టడి చేసేవిషయంలో మరో మాటకు తావులేదని తాజాగా రష్యా జాతీయ భద్రతా సలహాదారు భారత్ కు తెలిపారు. దీంతో తాలిబన్ల కట్టడి విషయంలో రష్యా-భారత్ కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఓ అంగీకారం కూడా కుదిరింది.
తాలిబన్ల చుట్టూ వలయానికి వ్యూహం
తాలిబన్ల బలమంతా ఆప్ఘనిస్తాన్ లోనే ఉంది. అదీ అమెరికా సహా పాశ్చాత్య దేశాలు వైదొలిగిన తర్వాత మాత్రమే. కాబట్టి ఇప్పుడు అమెరికా వెళ్లిపోయాక ఆప్ఘన్ ను ఆక్రమించిన తాలిబన్లు ఆ తర్వాత మిగతా దేశాలపై కన్నేస్తున్నారు. దీనికి ఆదిలోనే కట్టడి చేయాలన్న వ్యూహంతో భారత్ కదులుతోంది. ఇందులో భాగంగా తాలిబన్లను ఆప్ఘనిస్తాన్ కే పరిమితం చేసే వ్యూహానికి తెరతీస్తోంది. రష్యా ఎన్ఎస్ఏతో నిన్న జరిపిన చర్చల్లో భారత్... తాలిబన్ల గడ్డగా మారిన ఆప్ఘనిస్తాన్ కే వారిని పరిమితం చేసేలా చర్చలు జరిపింది. ఇందుకోసం మధ్య ఆసియా దేశాల సాయం తీసుకోవాలని నిర్ణయించింది. మధ్య ఆసియాలోని తజికిస్దాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెజిస్తాన్ వంటి దేశాలు రష్యాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు వాటిని భారత్ కు మద్దతిచ్చేలా రష్యా ఒప్పించబోతోంది. అదే జరిగితే భారత్ తాలిబన్లను కట్టడి చేయడం సులువవుతుంది.
తాలిబన్లను ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్ ?
తాలిబన్లతో కలిసి ఆసియాలో ఇస్లామీకరణ కోసం పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ చెప్పే విషయంలో భారత్ కు సాయం చేసేందుకు రష్యా సిద్దమైంది. దీనిపై కలిసి పనిచేసేందుకు సిద్దమని నిన్న రష్యా జాతీయ భద్రతా సలహాదారు భారత్ కు హామీ ఇచ్చారు. ఇందుకోసం ఆప్ఘనిస్తాన్ చుట్టూ ఉన్న మధ్య ఆసియా దేశాల్ని ఒప్పిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది అదే జరిగితే తాలిబన్లు ఆప్ఘన్ దాటి బయటికి వచ్చే వీలుండదు. పొరుగు భూభాగాలపై దాడులు కానీ, లేదా అక్కడ పాగా వేయడం కానీ చేసేందుకు వీలు చిక్కదు. అదే జరిగితే తాలిబన్లు ఆప్ఘన్ కే పరిమితమై ఉక్కిరిబిక్కిరికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకోసం భారత్-రష్యా వేస్తున్న వ్యూహాత్మక అడుగులు కచ్చితంగా తాలిబన్లను కట్టిపడేసేలా ఉన్నాయి. అదే జరిగితే అంతర్జాతీయంగా కూడా ఉగ్రవాదానికి అనుకూలంగా ఉన్న తాలిబన్లతో పాటు పాకిస్తాన్ ను కట్టడి చేసిన పేరు కూడా భారత్ కు దక్కబోతోంది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా కూడా భారత్ వ్యూహాలకు మద్దతిచ్చే అవకాశముంది. కాబట్టి భారత్ వేగంగా తమ ప్లాన్ అమల్లో పెట్టబోతోంది.