భారత్ చెడిపోయింది: విషంకక్కిన చైనా మీడియా
బీజింగ్: చైనా పత్రికలు భారత్ పైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ దేశంలో ప్రముఖ పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ మంగళవారం నాడు తన సంపాదకీయంలో భారత్ను తిట్టిపోసింది. భారతీయులు ఎలా మసలుకోవాలో నేర్చుకోవాలని సుద్దులు చెప్పింది.
భారత్ ఓ చెడిపోయిన దేశమని, అంతర్జాతీయ వ్యవహారాల్లో జిత్తులమారిగా వ్యవహరిస్తున్నారని, భారతీయులు మద్దతులు నేర్చుకోవాలని పిచ్చి రాతలు రాసింది. అణు సరఫరా దేశాల కూటమి (ఎన్ఎస్జీ)లో భారత్ చేరకుండా చైనా అడ్డుకోవడాన్ని సమర్థించింది.
చైనాలో చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో ప్రచురితం అవుతున్న ఈ పత్రిక చైనాలో పెద్దది. ఇది అధికార కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కనుసన్నుల్లో నడుచుకుంటుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయకుండా ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ పట్టుబట్టడం అనైతికమని పేర్కొంది.
భారత్తో పాటు అమెరికా పైన కూడా మండిపడింది. ప్రపంచం అంటే ఒక అమెరికానే కాదని, అది వెనుకేసుకొచ్చినంత మాత్రాన మిగతా ప్రపంచమంతా భారత్ను సమర్థించుతుందనుకోవడం సబబు కాదని రాసింది.
ఎన్ఎస్జీలో భారత్ చేరకుండా అడ్డుకుంది నిబంధనలే కానీ, చైనా కాదని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. భారత్ని 'స్పాయిల్ట్, స్మగ్, గోల్డెన్ బాయ్ ఆఫ్ ద వెస్ట్' అంటూ వర్ణించింది. భారత్ నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడింది.
ఇదిలా ఉండగా,
ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం కోసం అమెరికా పూర్తి మద్దతు ఇచ్చినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ఎస్జీప్లీనరీ సమావేశానికి ముందు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దక్షిణకొరియాలోని సియోల్లో జరిగిన సమావేశం భారత్పై నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.