పాకిస్తాన్ అణుస్థావరాలపై.. భారత్, అమెరికా కలిసి దాడి చేయాలి: యూఎస్ మాజీ సెనేటర్ సూచన
పాకిస్తాన్ లోని అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు అమెరికా, భారత్లు కలిసి ముందస్తు దాడులు చేయాల్సిందేనని యూఎస్ మాజీ సెనేటర్ ల్యారీ ప్రెస్లెర్ సూచించారు.
వాషింగ్టన్: పాకిస్తాన్ లోని అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు అమెరికా, భారత్లు కలిసి ముందస్తు దాడులు చేయాల్సిందేనని యూఎస్ మాజీ సెనేటర్ ల్యారీ ప్రెస్లెర్ సూచించారు.
పాక్ అణ్వాయుధాలు దాచిన ప్రదేశాలు, వాటిని తయారుచేస్తున్న ప్రాంతాలపై ఇరు దేశాలు దాడులు చేయాలని ఆయన పేర్కొన్నారు. పాక్లోని ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ హుకుం జారీ చేయడం ద్వారా ఆయనను భారత్ అత్యుత్తమ అమెరికా అధ్యక్షుడిగా పరిగణించే అవకాశం ఉందన్నారు.

మూడుసార్లు సెనేటర్గా, రెండుసార్లు ప్రతినిధుల సభలో సభ్యుడిగా పనిచేసిన ప్రెస్లర్ 1990లో అప్పటి అమెరికా అధ్యక్షుడు హెచ్డబ్ల్యూ జార్జి బుష్ పాకిస్తాన్ అణ్వాయుధాలను రూపొందిస్తోందని ధృవీకరించినప్పుడు ఆ దేశానికి సైనిక సాయం నిలిపివేయాలని కోరుతూ సవరణలను ప్రతిపాదించారు.
దీంతో పాకిస్తాన్ కు 30 ఎఫ్-16 యుద్ధ విమానాల సరఫరాను అమెరికా నిలిపివేసింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రెస్లర్ను సెనేట్ ఆర్మ్స్ కంట్రోల్ సబ్-కమిటీకి అధ్యక్షుడిగా నియమించడంతో పాక్కు ఆయుధ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రెస్లర్ అప్పట్లో మనదేశంలో హీరోగా మారిపోయారు.
కానీ పాకిస్తాన్ కు పెంటగాన్ మద్దతు ఉందని, ట్రంప్ తొలుత అటువైపు నుంచి చర్యలు మొదలుపెట్టాల్సి అవసరం ఉందని ల్యారీ ప్రెస్లెర్ అన్నారు. పెంటగాన్ అండతోనే భారత్పై దాడి చేయాలన్న ధైర్యం పాకిస్తాన్ కు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. తన సూచనను ట్రంప్ పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాదు, పాకిస్తాన్ ను తీవ్రవాద దేశంగా తప్పక అమెరికా ప్రకటించాలని కూడా యూఎస్ మాజీ సెనేటర్ ల్యారీ ప్రెస్లెర్ కోరారు. ఆ దేశానికి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని.. భారత్, పాకిస్తాన్ లను ఒకేలా చూడరాదని ఆయన సూచించారు.
ఇండియా ప్రజాస్వామ్య దేశమని, పాకిస్తాన్ మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ విషయంలో భారత ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న వైఖరిని ల్యారీ ప్రెస్లెర్ కొనియాడారు.












Click it and Unblock the Notifications