గల్ఫ్ లో బెంగళూరు మహిళకు టార్చర్.. భర్త అరెస్టు: సోషల్ మీడియా ద్వారా సహాయం కోరి..!
బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఓ మహిళ షార్జాలో నరకయాతనకు గురయ్యారు. భర్త చేతుల్లో చిత్రహింస బారిన పడ్డారు. తనను కాపాడాలంటూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియోపై షార్జా పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆమెను రక్షించారు. భర్త కొట్టిన దెబ్బలతో గాయపడిన ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతణ్ని అరెస్టు చేశారు. బాధితురాలి పేరు జాస్మిన్ సుల్తానా. వయస్సు 35 సంవత్సరాలు. ఎనిమిదేళ్ల కిందట ఆమెకు కర్ణాటకకే చెందిన మహమ్మద్ ఖైజరుల్లా అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లి తరువాత వారు షార్జాలో స్థిరపడ్డారు. ఖైజరుల్లా స్థానికంగా నగల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు.
కొంతకాలంగా ఖైజరుల్లా తనను దారుణంగా కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ జాస్మిన్ సుల్తానా ఈ నెల 12వ తేదీన తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. భర్త కొట్టిన దెబ్బలకు ముఖం చిట్లిపోయిందని ఆమె చెప్పారు. రక్తమోడుతున్న ముఖంతోనే ఆమె సెల్ఫీ వీడియోను చిత్రీకరించారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షార్జా పోలీసులకు ట్యాగ్ చేశారు. తన భర్త రోజూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, పాస్ పోర్టును లాక్కున్నాడని ఆరోపించారు. ఇల్లొదిలి వెళ్తాననే అనుమానంతో తన వద్ద నగదు, నగలను కూడా లాక్కున్నాడని చెప్పారు.
Recommended Video
ఈ వీడియో తమ దృష్టికి రాగానే షార్జా పోలీసులు స్పందించారు. వెంటనే రంగంలోకి దిగారు. మరుసటి రోజే ఖైజరుల్లాను అరెస్టు చేశారు. జాస్మిస్ సుల్తానా స్వస్థలం బెంగళూరు అని, అంగీకరిస్తే ఆమెను స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేస్తామని షార్జా పోలీసులు తెలిపారు. బాధితురాలికి అయిదేళ్లు, 17 నెలల పిల్లలు ఉన్నారని, వారిని సురక్షితంగా స్వదేశానికి పంపిస్తామని చెప్పారు. జాస్మిన్ సుల్తానాను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఖైజరుల్లాపై కేసు నమోదు చేశామని, అతణ్ని త్వరలోనే న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని షార్జా పోలీసులు పేర్కొన్నారు.