రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: భారతీయ విద్యార్థులు, పౌరులకు కీలక ఆదేశాలు: స్వదేశానికి రావాలంటూ
కీవ్: యూరోపియన్ దేశం ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ- మరింత తీవ్రరూపాన్ని దాల్చింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు దిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా. ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని తరలించింది. వారి సంఖ్యను మరింత పెంచుతూ పోతోంది.
భారత్ హైఅలర్ట్..
ఈ పరిణామాలతో భారత్ అప్రమత్తమైంది. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. కీవ్లోని రాయబార కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటోంది. రష్యా సైనిక చర్యకు దిగడమంటూ జరిగితే- అక్కడ ఏర్పడే పరిణామాలను అంచనా వేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే- ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే విషయం మీద ఆరా తీస్తోంది.
భారతీయులు, విద్యార్థులకు ఆదేశాలు..
ఈ నేపథ్యంలో- ఉక్రెయిన్లో నివసిస్తోన్న భారతీయులు, విద్యార్థులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. తక్షణమే స్వదేశానికి రావాలంటూ సూచించింది. అత్యవసర పనుల కోసం ఉన్న వారు మినహా.. మిగిలిన వారందరూ వెంటనే స్వదేశానికి వచ్చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం కొద్దిసేపటి కిందటే అడ్వైజరీని జారీ చేసింది. అత్యవసర పనుల కోసం ఉక్రెయిన్లో నివసించే భారతీయులు ఎప్పటికప్పుడు తమ సమాచారాన్ని రాయబార కార్యాలయానికి తెలియజేయాలని కోరింది.
అడ్రస్ తెలియజేయాలంటూ..
తాము నివసించే ప్రాంతాలు, చిరునామా, ఫోన్ నంబర్లను తమతో పంచుకోవాలని తెలిపింది. ఎంబసీ కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతాయని, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తమ దేశ పౌరులకు రాయబార కార్యాలయం నుంచి సేవలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దీనికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొంది. విద్యార్థులు భారత్కు వెళ్లిపోవడమే మంచిదని స్పష్టం చేసింది.
అమెరికా ఎంబసీ ఇదివరకే ఖాళీ..
అగ్రరాజ్యం అమెరికా సైతం ఇదివరకే తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించింది. కొంతమంది కీలక అధికారులు మినహా.. మిగిలిన వారందరినీ స్వదేశానికి పిలిపించుకుంది. ఎంబసీలో పని చేసే సాధారణ ఉద్యోగులు.. కుటుంబాలతో సహా స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. ఉక్రెయిన్లో నివసిస్తోన్న తమ దేశ పౌరులు వెంటనే వెనక్కి రావాలని సూచించింది. ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న వివాదాలు, యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడానికి అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించింది.
వెనక్కి తగ్గని రష్యా..
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చడానికి అమెరికా ఆ రెండు దేశాలతో సంప్రదింపులు నిర్వహించింది. ఆ చర్చలేవీ ఫలించలేదు. రష్యా వెనక్కి తగ్గలేదు. తన సైన్యాన్ని సరిహద్దులకు తరలించడాన్ని మరింత ముమ్మరం చేసింది. వైమానిక బలగాలను పెద్ద ఎత్తున మోహరింపజేసింది. సరిహద్దుల్లో శాశ్వత కట్టడాల నిర్మాణానికీ పూనుకుంది. ఈ పరిస్థితులన్నీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందనే సంకేతాలను పంపించినట్టయింది.