ఇరాన్లో యుద్ధ మేఘాలు- తక్షణమే ఆ దేశం వీడండి, కేంద్రం బిగ్ అలర్ట్..!!
ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ ఉంటున్న భారత పౌరులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా వెంటనే ఇరాన్ను విడిచిపెట్టాలని సూచించింది. ఇరాన్పై ఏ క్షణమైన అమెరికా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇరాన్ వీడి.. స్వదేశానికి వచ్చే క్రమంలో వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవాలని వారిని కోరింది. ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులకు సైతం ఈ సూచనలు వర్తిస్తాయని పేర్కొంది.
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లోని భారత రాయబార కార్యా లయం అక్కడ నివసిస్తున్న భారత పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఎప్పుడైనా మొదలయ్యే అవకాశాలు ఉండటంతో, భారతీయులందరూ తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఇరాన్లో వేగంగా మారుతున్న పరిస్థితులను దృష్టి లో ఉంచుకుని, జనవరి 5న భారత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా ఈ కొత్త అడ్వైజరీని జారీ చేస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది.

ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు.. విద్యార్థులు,యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులు-అందుబాటులో ఉన్న కమర్షియల్ విమాన సర్వీసులు లేదా ఇతర ప్రయాణ సౌకర్యాలను వినియోగించి తక్షణమే దేశాన్ని వీడాలని సూచించింది. భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
ఇరాన్లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, స్థానిక మీడియా ద్వారా తాజా పరిణామాలను గమనించాలని సూచించింది. ప్రతి ఒక్కరూ తమ పాస్పోర్ట్లు, గుర్తింపు కార్డులు, ప్రయాణ,ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది. అవసరమైతే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని, ఇంకా ఎంబసీ వద్ద తమ వివరాలు నమోదు చేయించుకోని వారు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అడ్వైజరీలో స్పష్టం చేసింది.
తమ పాస్పోర్ట్లు, ఇతర ముఖ్యమైన ప్రయాణ పత్రాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని వారికి తెలిపింది. టెహ్రాన్లోని రాయబార కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోని వారు వెంటనే.. అధికారిక ఆన్ లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపింది. అత్యవసర సమయంలో ఇక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలంటూ హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల చేసింది. +989128109115; +989128109109; +989128109102; +989932179359. అలాగే [email protected] ఈ మెయిల్ ద్వారా తమను సంప్రదించ వచ్చని ఇరాన్లోని భారతీయులకు భారత్ సూచించింది.












Click it and Unblock the Notifications