అమెరికాలో మరో దారుణం: భారత సంతతి హోటల్ యజమాని కాల్చివేత
వాషింగ్టన్: అమెరికాలో భారతీయులు, భారత సంతతి వ్యక్తులపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, మరో దారుణం జరిగింది. అలబామాలో ఒక హోటల్ను నిర్వహిస్తున్న ప్రవీణ్ రావోజీ భాయ్ పటేల్(76) అనే భారత సంతతి వ్యక్తిని ఓ దుండగుడు కాల్చిచంపాడు. హోటల్ రూమ్ విషయంలో ప్రవీణ్, విలియం జెరెమీ మూర్ అనే ఓ కస్టమర్ మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు విలియం జెరెమీ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ రావోజీ భాయ్ షెఫీల్డ్లోని 'హిల్క్రెస్ట్ హోటల్' యజమానిగా ఉన్నారని స్థానిక మీడియా రిపోర్ట్ తెలిపింది.

ఈ ఘటనపై షెఫీల్డ్ ప్రధాన పోలీసు అధికారి రికీ టెర్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రవీణ్ రావోజీని తుపాకీతో కాల్చి చంపిన నిందితుడు విలియం జెరెమీ మూర్ను (34) అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడు మూర్ ఒక గదిని అద్దెకు తీసుకోవాలని హోటల్కు వచ్చాడని.. అయితే ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు.
తీగ్ర ఆగ్రహానికి గురైన మూర్ తుపాకీతో కాల్పులు జరిపాడని, అనంతరం నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడని తెలిపారు. అయితే అతడిని అదుపులోకి తీసుకున్నామని సదరు పోలీసు అధికారి వెల్లడించారు. కాగా, వాగ్వాదం తర్వాత మూర్ని హోటల్ నుంచి బయటకు పంపించేందుకు పటేల్ ప్రయత్నించారని, కానీ, కొంతదూరం వెళ్లిన మూర్ అకస్మాత్తుగా వెనక్కి వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications