US-Iran War: ఇరాన్ అణ్వస్త్ర హెచ్చరిక..! ట్రంప్ దాడుల వేళ షాకింగ్..!
ఇరాన్ (Iran) ను ఏదో విధంగా లొంగదీసుకునేందుకు ఆరు నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమైనీతో పాటు టాప్ కమాండర్లు అందరినీ చింపేసినా.. ఆ దేశం మాత్రం ట్రంప్ కు లొంగడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్న ట్రంప్.. ఆ అసహనంతో ఇరాన్ ఆయువు పట్టు అయిన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించారు. అటువైపుగా వచ్చే ఇరాన్ నౌకలపై దాడులు చేస్తున్నారు. దీంతో ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. తాజాగా హార్ముజ్ తమదేనని ట్రంప్ ఓ మ్యాప్ కూడా విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో ఇరాన్ ఇక చివరి అస్త్రం వాడేందుకు సిద్దమవుతోంది. ఇన్నాళ్లూ ఏ అణ్వస్త్రాలు తయారు చేస్తుందని ఇరాన్ ను అమెరికా, ఇజ్రాయెల్ కట్టడి చేస్తూ వచ్చాయో, అదే అణ్వస్త్రాన్ని ఇప్పుడు తయారు చేసేందుకు ఇరాన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ చేస్తున్న దాడులతో ప్రపంచ దేశాలకు అణ్వస్త్రాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందని ఇరాన్ తాజాగా ప్రకటించింది. అణ్వస్త్ర నిరోధక ఒప్పందాలపై సంతకాలు చేసిన దేశాలకు కానీ, అణు ఇంధన సంస్ధలో భాగస్వాములైన దేశాలకూ కానీ అమెరికా నుంచి రక్షణ లేదని ఇరాన్ తేల్చిచెప్పేసింది.

ప్రపంచ అణు భద్రతను ట్రంప్ దెబ్బతీస్తున్నారని ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ఆరోపించారు. ఇరాన్పై దాడుల వల్ల అణ్వాయుధాలు సంపాదించాలనే దేశాల కోరిక పెరిగిందన్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA), అణు నిరాయుధీకరణ ఒప్పందం (NPA)లో సభ్యత్వం కలిగి ఉన్న దేశాలకూ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
ఇరాన్పై ట్రంప్ చేసిన దాడులతో ఆయన దూకుడు వైఖరి, ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో అణ్వాయుధాలను సంపాదించాలనే కోరికను పెంచిందని తెలిపారు. ట్రంప్ అణు భద్రతకు బదులుగా అణు అభద్రతను సృష్టించారన్నారు.ఇరాన్ అంతర్జాతీయ భద్రతా చర్యలను అంగీకరించిందని, వాటికి కట్టుబడి ఉందని, ఎన్పిటిలో సభ్యదేశంగా కొనసాగుతోందని, తనిఖీలకు అంగీకరించిందని గుర్తుచేసారు. అయినా తమకు భద్రత లేదని ఇరాన్ తెలిపింది. కాబట్టి అణ్వస్త్రాలు తయారు చేసుకోవాలనే కోరిక తమకు పెరుగుతోందన్నారు.














Click it and Unblock the Notifications