సరిహద్దులో అలజడి: ఇరాన్ సైనికులు-తాలిబన్ బలగాల మధ్య భీకరపోరు.. కారణం ఏంటంటే..?
ఆప్ఘన్లో తాలిబాన్ల అరాచక పాలన కొనసాగుతోంది. దేశంలో ఉన్న వారిని వేధించడమే కాదు.. పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. తాజాగా ఇరాన్తో తాలిబాన్లు గొడవకు దిగారు. ఇరాన్ సైనికులు, తాలిబాన్లకు సరిహద్దులతో ఘర్షణ జరిగింది. అయితే ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఆ తర్వాత తప్పుగా అర్థం చేసుకోవడంతో ఇలా జరిగిందని కవరింగ్ చేశారు. ఈ ఘర్షణకు సంబంధించి బుధవారం రోజునే పలు వీడియోలు బయటకు వచ్చాయి.
తాలిబాన్లు గన్స్ ఫైర్ చేయగా.. ఇరానీ దళాలు ఆర్టిలరీ షెల్స్ ప్రయోగించారు. అయితే తొలుత తాలిబాన్లు ఫైర్ చేయడంతోనే వారు స్పందించారు. హిరామండ్ కౌంటీ షాగాలక్ వద్ద ఘర్షణ జరిగిందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ తాసిమ్ రిపోర్ట్ చేసింది. అఫ్ఘానిస్తాన్ సరిహద్దు మీదుగా ఇరాన్ భూభాగంలో కొన్ని ప్రాంతాల్లో బలమైన గోడలు నిర్మించి ఉన్నాయి. స్మగ్లింగ్ను అణిచివేసేందుకు ఈ గోడలను నిర్మించారు. కొందరు రైతులు ఈ గోడలు దాటుకుని వచ్చారు.. కానీ వారు ఇరాన్ భూభాగంలోనే ఉన్నారు. ఇది తప్పుగా అర్థం చేసుకున్న తాలిబన్ బలగాలు ఫైరింగ్ ప్రారంభించాయి. సరిహద్దు వద్ద నిబంధనలను ఉల్లంఘించారని భావించి కాల్పులు ప్రారంభించాయి.
ఇక ఇటు ఇరాన్ సైనికులు కూడా కాల్పులకు దిగడంతో ఇద్దరి మధ్య కాసేపు భీకరపోరు సాగింది. ఆ తర్వాత ఆగింది. ఈ ఘటనపై ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి స్పందించారు. ఇరాన్ తాలిబన్ బలగాల మధ్య ఏర్పడిన సమాచార లోపంతోనే ఈ కాల్పులు జరిగాయని వివరించారు.ఇక ఇరాన్లోకి తాలిబన్లు చొరబడిన వీడియో వైరల్గా మారింది. అంతేకాదు తాలిబన్లు ఇరాన్ ఔట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లుగా అందులో ఉంది.
ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇరాన్ వర్గాలు తెలిపాయి. పబ్లిష్ అయిన కొన్ని వీడియో ఫుటేజీలు గొడవ జరగడానికి ముందు తీసినవని చెప్పారు. ప్రస్తుతం సరిహద్దులు తమ అధీనంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే తాలిబన్లు తొందరపాటు చర్యతోనే కాల్పులు చోటుచేసుకున్నాయని సిస్తాన్ బలుచిస్తాన్ గవర్నర్ మొహ్మద్ మరాషి ఓ ఇరాన్ ఛానెల్తో చెప్పారు. ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తులకు కూడా నష్టం జరగలేదని ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తాలిబన్ ప్రభుత్వాన్ని ఇరాన్ అధికారికంగా గుర్తించలేదు.