మహిళా జర్నలిస్టును చంపేసిన ఐఎస్ఐఎస్
రక్కా: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గూఢచార్యం చేస్తున్నదని ఆరోపిస్తూ మహిళా జర్నలిస్టును అతి దారుణంగా ఉరి తీసి చంపేశారు. రక్కా ప్రాంతంలోని పౌర జర్నలిస్టుగా పని చేస్తున్న రుఖియా హసన్ అనే మహిళను ఉరి తీశారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చంపిన తొలి మహిళ రుఖియా హసన్ అని, గత అక్టోబర్ నెల నుంచి ఇప్పటి వరకు ఉగ్రవాదులు ఐదు మంది విలేకరులను హత్య చేశారని సిరియాలోని సీనియర్ జర్నలిస్టు సంస్థ ‘సిరియా డైరెక్ట్' తెలిపింది.
ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న రక్కా ప్రాంతంలో స్థానిక ప్రజల దైనందిత జీవితం గురించి రుఖియా హసన్ నిసాన్ ఇబ్రహీం అనే పేరుతో ఫేస్ బుక్ లో నిత్యం వార్తలు అందించేది. ఉగ్రవాదుల అరాచకాలను ప్రపంచానికి చూపించింది.
నేను రక్కాలో ఉన్నాను, నన్ను చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, వాళ్లు నన్ను చంపేస్తారని, ఐఎస్ఐఎస్ చేస్తున్న అవమానాల మధ్య జీవించడం కంటే చనిపోవడం మేలు అని శనివారం సిరియా మానవహక్కుల సంస్థ (ఆర్బీఎస్ఎస్) వ్యవస్థాపకుడు అబు అహమ్మద్ కు చివరికి సారిగా ట్వీట్టర్ లో వెల్లడించింది.
రక్కా నగరంలో వై-పై హాట్ స్పాట్ లను ఐఎస్ఐఎస్ నిషేదించింది. ఈ నిర్ణయాన్ని రుఖియా హసన్ ఫేస్ బుక్ లో తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. వై-పై, ఇంటర్నెట్ సేవలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నిషేదించారని ఆరోపించింది.
మీరు ఎంత చేసినా మా సమాచారాన్ని మోసుకెళ్లే పావురాళ్లను ఏమీ చెయ్యలేరని ఆమె పేర్కొన్నారు. 2015 జులై 21 నుంచి రుఖియా హసన్ కనపడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత శనివారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రుఖియా హసన్ కుటుంబ సభ్యులకు ఓ సందేశం పంపించారు.
గూడచార్యం చేస్తున్నందుకు మీ అమ్మాయిని చంపేశామని ఉగ్రవాదులు వారికి సమాచారం ఇచ్చారు. మహిళా జర్నలిస్టు రుఖియా హసన్ ను ఉరి తియ్యడానికి సిరియా మానవహక్కుల సంస్థ తప్పుపట్టింది. రుఖియా హసన్ ను చంపేశారని ఆ సంస్థ దృవీకరించింది.