ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు: ఆచూకి ఇస్తే 20 మిలియన్ డాలర్లు
వాషింగ్టన్: కరుడు కట్టిన తీవ్రవాదులు, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) గ్రూప్ లోని నలుగురు కిరాతకుల ఆచూకి చెబితే 20 మిలియన్ డాలర్లు బహుమతిగా అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆ నలుగురు తీవ్రవాద నాయకుల గురించి ఆమెరికా పూర్తి వివరాలు సేకరిస్తున్నది.
అమెరికా మోస్ట్ వాటెండ్ లిస్ట్ లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద నాయకులు అబ్ద్ అల్-రెహమాన్ ముస్తఫా అల్-ఖదూలి, అబు మహమ్మద్ అల్-అద్నాని, తర్కన్ తయూమురాజోవిచ్ బత్రసావిలి, తారిక్ బిన్ అల్-తహర్ బిన్ అల్ ఫలిహల్ అనే నలుగురు నాయకులు ఉన్నారు.
వీరి కోసం అమెరికా చాల కాలంగా గాలిస్తున్నది. అబ్ద్ అల్-రెహమాన్ ముస్తఫా అల్-ఖదూలి మీద 7 మిలియన్ డాలర్లు, అబు మహమ్మద్ అల్-అద్నాని మీద ఐదు మిలియన్ డాలర్లు, తర్కన్ తయూమురాజోవిచ్ బత్రసావిలి మీద ఐదు మిలియన్ డాలర్లు, తారిక్ బిన్ అల్-తహర్ బిన్ అల్ ఫలిహల్ మీద 3 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించారు.
ఎవరైనా సరే వీరి ఆచూకి అందిస్తే తాము ప్రకటించిన బహుమతి అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నలుగురు కరుడు కట్టిన తీవ్రవాదుల వలన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారని, అరాచకాలు సృష్టిస్తున్నారని అమెరికా అధికారులు అంటున్నారు.