లెబనాన్లో నరమేథం- హాహాకారాలు
Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు బ్రేకులు పడట్లేదు. మరింత తీవ్రతరం అయ్యాయి. 48 గంటలుగా ఏకధాటిగా మిస్సైళ్ల వర్షం కురుస్తోంది. జనావాసాలను సైతం లెక్కచేయట్లేదు ఇజ్రాయెల్. క్షిపణులు, అత్యాధునిక డ్రోన్ల సహకారంతో శక్తిమంతమైన బాంబు దాడులను కొనసాగిస్తోంది.
ఈ ఘటనల్లో ఇప్పటివరకు 496 మంది దుర్మరణం పాలయ్యారు. 1,600 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

లెబనాన్లో గల హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. దీనికోసం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అత్యంత శక్తిమంతమైన, ఆధునిక ఆయుధాలను ఉపయోగిస్తోంది. తేలికపాటి మిస్సైళ్లను సైతం మోసుకెళ్లే సామర్థ్యం గల డ్రోన్లను ప్రయోగిస్తోన్నట్లు తెలుస్తోంది.
మొన్నటికి మొన్న లెబనాన్లో పేజర్ల పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది హెజ్బొల్లా ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులు దుర్మరణం పాలయ్యారు. 4,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న స్థితిలో ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు.
ఈ ఘటనతో మధ్య- తూర్పు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పేలుడుకు ఇజ్రాయెల్ ప్రధాన కారణమంటూ లెబనాన్ మండిపడుతోంది. దీనికి కొనసాగింపుగా ఇజ్రాయెల్ తాజాగా ఈ భారీదాడులకు పాల్పడినట్లు అంచనా వేస్తోన్నారు విశ్లేషకులు.

లెబనాన్లో మొత్తంగా 1,300లకు పైగా హెజ్బొల్లా స్థావరాలపై ఈ దాడులు సాగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు సోమవారం తెల్లవారు జామున 6:30 గంటలకు మొదలయ్యాయని తెలిపింది. సిడాన్, మర్జయాన్, నబాటి, టయర్, జెజ్ఝీన్, జెహ్రానీ జిల్లాలతో పాటు తూర్పు ప్రాంతంలోని జహ్లేయ్, బాల్బెక్, హెర్మెల్ రోజంతా దాడులు సాగాయి.
మృతుల సంఖ్యను లెబనాన్ అధికారికంగా ధృవీకరించింది. తాజాగా చోటు చేసుకున్న దాడుల్లో 492 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో 35 మంది పిల్లలు, 58 మంది మహిళలు ఉన్నట్లు వివరించింది. 20 సంవత్సరాల్లో ఇంత భారీగా మారణహోమం ఎప్పుడూ సంభవించలేదని తెలిపింది. అత్యంత ఘోర దాడిగా అభివర్ణించింది.












Click it and Unblock the Notifications