వారణాసిలో ఆకట్టుకున్న మోడీ-షింబో సైకతశిల్పం
న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని షింబో అబే మూడు రోజుల భారత పర్యటనను స్వాగతిస్తూ వారణాసిలో సైకతశిల్పం రూపొందించారు. భారత్, జపాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడాలని కోరుకుంటూ సైకత శిల్పి రాజేశ్ కుమార్ వారణాసిలోని అస్సీ ఘాట్లో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.
ఇరు దేశాల అధినేతలు కరచాలనం చేస్తున్నట్లు ఏర్పాటు చేసిన ఈ సైకతశిల్పం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జపాన్ ప్రధాని షింబో అబే భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా బుల్లెట్ రైలు వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన రూ. 98 వేల కోట్ల ఒప్పందంపై ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలు సంతకాలు చేయనున్నారు. శనివారం జరగనున్న 9వ వార్షిక ఇండో-జపాన్ శిఖరాగ్ర సదస్సులో వాణిజ్య అంశాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలపై మోడీ, షింబో అబే సమీక్షించనున్నారు.
దీంతో పాటు ఇరుదేశాల మధ్య అణ సహకారం, యూఎస్-2 విమానాల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. చర్చల అనంతరం ఇరు దేశాల ప్రధానులు వారణాసి బయలుదేరుతారు.
వారణాసిలో నిర్వహించే గంగా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోడీ, షింబో అబే వారణాసిలో పర్యటించనున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేయి మంది పోలీసులు, పలు కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు ఇప్పటికే వారణాసికి చేరుకున్నాయి.
మూడు రోజుల పర్యటనలో భాగంగా షింబో అబే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా సమావేశం కానున్నారు. ఆ తర్వాత జపాన్-ఇండియా సృజనాత్మక సమావేశంలో పాల్గొంటారు.